దేవినేనికి ప్రాణహాని ; జైల్లో ఉన్న ప్రత్యర్ధులను హతమార్చిన చరిత్ర వైసీపీది : అచ్చెన్న, గోరంట్ల ధ్వజం
కొండపల్లి అక్రమ మైనింగ్ వ్యవహారం, అక్కడ జరిగిన దేవినేనిపై దాడి ఘటన, ఆపై జరిగిన పరిణామాలు, నమోదైన కేసులతో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో రిమాండ్ ఖైదీగా ఉన్న దేవినేని ఉమాకు ప్రాణహాని ఉందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. దేవినేని ఉమాకు హాని చేసే ఉద్దేశంతోనే జైలు సూపరింటెండెంట్ ను అకస్మాత్తుగా మార్చారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపిస్తున్నారు.
జైలు సూపరింటెండెంట్ రాజారావు ఆకస్మిక బదిలీపై టీడీపీ అనుమానాలు .. అచ్చెన్న ఫైర్
దేవినేని ఉమాను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించగానే అక్కడ జైలు సూపరింటెండెంట్ రాజారావును ఆకస్మికంగా బదిలీ చేశారని, ఆయన స్థానంలో కిషోర్ కుమార్ అనే అధికారిని నియమించారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కావాలని దేవినేనికి హాని తలపెట్టే ఉద్దేశంతోనే ఈ మార్పు చేశారని అచ్చెన్న ఆరోపించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ లో దేవినేని ప్రాణానికి రక్షణ లేదని ఆయన ఆరోపించారు. తప్పుడు కేసులు పెట్టి దేవినేని ఉమా ను జైలుకు పంపించడమే కాకుండా ఆయన ప్రాణాలకు హాని తలపెట్టే కుట్రలను కూడా చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
దేవినేనికి హాని జరిగితే బాధ్యత ప్రభుత్వానిదే
వైసీపీ నేతలకు జైల్లో ఉన్న ప్రత్యర్థులను హత్య చేయించిన చరిత్ర ఉందని, రాజారావు ఆకస్మిక బదిలీ వెనుక దేవినేని ఉమ ను హతమార్చే కుట్ర కోణం ఉందని అచ్చెన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రాణానికి ఎటువంటి హాని జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని స్పష్టం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఆకస్మిక బదిలీకి గల కారణాన్ని చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సైతం రాజమండ్రి సెంట్రల్ జైల్ లో దేవినేని ఉమా ప్రాణాలకు రక్షణ లేదని అభిప్రాయపడ్డారు.
రాష్ట్రాన్ని జగన్ సొంత జాగీర్ లా భావిస్తున్నారు : గోరంట్ల బుచ్చయ్య చౌదరి
టిడిపిలో ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ వైసీపీ దాడులకు పాల్పడుతోందని టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ మైనింగ్ క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లకుండా టిడిపి నేతలను అడ్డుకోవడం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ను రాత్రికి రాత్రే బదిలీ చేశారని, ఈ బదిలీ వెనుక కుట్ర దాగి ఉందన్నారు. రాష్ట్రాన్ని జగన్ సొంత జాగీరుగా మార్చుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
Recommended Video
పరిటాల హత్య కేసు నిందితులను జైల్లోనే హతమార్చలేదా?
పరిటాల రవి హత్య కేసులో నిందితులను జైల్లోనే హత్య చేయించారని ఆరోపించిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇప్పుడు దేవినేని ఉమాకు హాని తలపెట్టే అవకాశం ఉందని ఆరోపించారు. అందుకే సూపరింటెండెంట్ ను బదిలీ చేశారన్నారు. వైసిపి రాక్షస పాలన పతనానికి తాజా పరిణామాలు నాంది అని పేర్కొన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఖచ్చితంగా ప్రజా ఆగ్రహం నుండి జగన్ తప్పించుకోలేరని మండిపడ్డారు. జగన్ హయాంలో ఏపీలో అరాచక పాలన సాగుతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.