గొర్రెను కాదు పులిని గెలిపించండి: తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికపై అచ్చెన్నాయుడు హాట్ కామెంట్స్
తిరుపతి లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నిక అధికార ప్రతిపక్ష పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి తీరాలని టిడిపి, అత్యధిక మెజారిటీతో విజయకేతనం ఎగురవేయాలని వైసిపి ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇదే సమయంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తిరుపతి లోక్సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీ ఎంపీలు పార్లమెంట్ లో గొర్రెల్లా కూర్చుంటున్నారు
తిరుపతి లోక్సభ స్థానం నుండి ఉప ఎన్నికలలో ఇంకొక గొర్రెను కాకుండా పులిని గెలిపించాలని ఓటర్లకు అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. కేంద్రం మెడలు వంచుతాం అని చెప్పిన జగన్ రెడ్డి మాటలు నమ్మి ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపిస్తే వారు పార్లమెంటులో ఏమీ చేతకాని వారిలా, గొర్రెల్లా కూర్చుంటున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. నిన్నటికి నిన్న కేంద్రం ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెప్పడం, పోలవరం, విభజన హామీల విషయంలో కేంద్రం చేసిన ప్రకటన నేపథ్యంలో, ప్రత్యేక హోదా తో పాటుగా పోలవరం నిధులు, విభజన హామీలు ఏవీ సాధించటం వైసీపీ ఎంపీల వల్ల కాదని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
టీడీపీ ఎంపీలు ముగ్గురైనా పులుల మాదిరిగా పోరాటం చేస్తున్నారు
తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ముగ్గురు ఎంపీలు పులుల మాదిరిగా పోరాడుతున్నారని, వైసీపీకి మరో ఎంపీని గెలిపిస్తే గొర్రెల మందకు తోడుగా మరో గొర్రెను పంపించటం అవుతుందని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. అందు వల్ల రాష్ట్రానికి ప్రజలకు జరిగే ప్రయోజనం ఏమీ లేదని పేర్కొన్నారు. పార్లమెంట్ కు మరో పులిని పంపిస్తే రాష్ట్రానికి ఎంతోకొంత న్యాయమైనా జరుగుతుందని పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీ నుండి అభ్యర్థిగా బరిలోకి దిగనున్న , నేడు నామినేషన్ వేయనున్న పనబాక లక్ష్మిని గెలిపించాలని, పులిలా పార్లమెంట్లో ఆమె పోరాటం చేస్తుందని అచ్చెన్నాయుడు తెలిపారు.
Recommended Video
జగన్ పాలనలో రాష్ట్రానికి నష్టం .. అందుకే టీడీపీని గెలిపించాలన్న అచ్చెన్న
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సీఎం జగన్ అడ్డుకోలేకపోతున్నారని , జగన్ కనుసన్నలలోనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఇక ఈ నెల 26వ తేదీన తలపెట్టిన భారత్ బంద్ కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ప్రకటించిన అచ్చెన్నాయుడు సీఎం జగన్ పాలనలో, కేంద్రం రాష్ట్రానికి తీరని నష్టం చేస్తుందంటూ అసహనం వ్యక్తం చేశారు. తనపై ఉన్న కేసుల మాఫీ కోసం జగన్ నోరు మెదపడం లేదని నిప్పులు చెరిగారు. అందుకే టీడీపీ ఎంపీకి అవకాశం ఇవ్వాలని , రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తారని అన్నారు అచ్చెన్నాయుడు .