మూడు రాజధానులకు మూడు ఇటుకలైనా పెట్టారా? బ్రిటీష్ నియంతపాలన 2.0లా జగన్ రెడ్డి పాలన: అచ్చెన్న ఆగ్రహం
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై, జగన్ సర్కార్ పాలనపై టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిపై ఆంక్షలు విధిస్తున్నారని, నిర్బంధాలకు గురిచేస్తున్నారని, సంకెళ్లు వేస్తున్నారని మండిపడిన అచ్చెన్నాయుడు జగన్ పాలనలో ఇప్పటి వరకు రాష్ట్రం ఏ విధంగానూ అభివృద్ధి చెందలేదని అసహనం వ్యక్తం చేశారు.

అమరావతి సభకు కోర్టు అనుమతిచ్చినా వైసీపీ అడ్డంకులు
బ్రిటిష్ నియంత పాలన 2.0 అన్నట్టుగా జగన్ రెడ్డి పాలన ఉందని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని రైతులు చేస్తున్న మహా పాదయాత్ర విజయవంతమైందని, దీంతో వైసీపీ నేతలు కడుపు మంటతో బాధపడుతున్నారని అచ్చెన్నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అందుకే అమరావతి రైతుల మహాసభకు కోర్టు అనుమతి ఇచ్చినా, ప్రజలు సభకు వెళ్లకుండా ఎక్కడికక్కడ వైసిపి అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు.

బ్రిటీష్ నియంత పాలన , జగన్ పాలన ఒకటే
బ్రిటిష్ వారి నియంత పాలన గురించి చరిత్రలో చదువుకున్నాం తప్ప ప్రత్యక్షంగా చూడలేదని పేర్కొన్న అచ్చెన్నాయుడు జగన్ పుణ్యాన ఇప్పుడు అలాంటి బ్రిటీష్ నియంత పాలనను చూస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల నిరవధిక దీక్షకు సంఘీభావం తెలపడం కోసం వెళ్తున్న టిడిపి నేతలను అక్రమంగా హౌస్ అరెస్టు చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసిపి మూడేళ్ల పాలనలో పోలవరం పనులు ఏం చేశారు? పోలవరం నిర్వాసితులకు ఏం న్యాయం చేశారు? అన్న ప్రశ్నలకు మంత్రులు, ముఖ్యమంత్రి సమాధానం చెప్పగలరా అంటూ ప్రశ్నించారు అచ్చెన్నాయుడు. జగన్ చేతగానితనంతో, అసమర్ధతతో పోలవరం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విమర్శలు గుప్పించారు.

పోలవరం నిర్వాసితులకు న్యాయం అడిగితే అరెస్ట్ చేస్తారా ?
పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయమని అడిగినందుకు అన్యాయంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పోలవరం నిర్వాసితులు పది రోజుల నుంచి నిరవధిక దీక్ష చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. జగన్ రెడ్డి మూడు రాజధానులు కడతానని మూడు సంవత్సరాలు కావస్తోంది కానీ ఇప్పటివరకు మూడు ప్రాంతాల్లో కనీసం మూడు ఇటుకలు కూడా పేర్చలేదని విమర్శించారు. తప్పుడు ప్రచారం తో అమరావతిని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ కు తీరని నష్టం చేకూర్చారని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

మూడు రాజధానులను ప్రకటించి అమరావతి నిర్వీర్యం
మూడు రాజధానులు ప్రకటించి రాజధాని విషయంలో అనిశ్చితి నెలకొనేలా చేశారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ కు టిడిపి నేతలను అక్రమంగా అరెస్టు చేయడం పై ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజలకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ నాయకులను అరెస్టు చేయడం, అక్రమ కేసులు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేయడం మూర్ఖత్వమని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

పోలవరం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి, మౌలిక వసతులు కల్పించాలి
జగన్ సర్కార్ ఎంతగా అడ్డంకులు సృష్టించినప్పటికీ తాము ప్రజల పక్షాన నిలబడతామని, ప్రజల కోసం పోరాటాలు చేస్తామని తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని, పునరావాస కేంద్రాలలో మౌలిక వసతులను కల్పించాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అక్రమంగా హౌస్ అరెస్టు చేసిన టిడిపి నేతలను విడుదల చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో నోటికొచ్చినట్టు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేస్తారా అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications