బాలకృష్ణ ఇంటిపై కాదు, రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న జగన్ ఇంటిపై దాడి చెయ్యండి: అచ్చెన్నాయుడు
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడికి ప్రయత్నం చేసిన ఘటనపై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన హిందూపురం అభివృద్ధిపై స్థానికులు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అభివృద్ధిని మరిచిపోయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటిపై దాడి చేయాలని ఆయన పేర్కొన్నారు.

బాలయ్య ఇంటిపై కాదు జగన్ ఇంటిపై దాడి చెయ్యండి: అచ్చెన్నాయుడు
బాలకృష్ణ ఇంటిపై దాడి చేసిన ఘటనపై మాట్లాడిన అచ్చెన్నాయుడు బాలకృష్ణ ఇంటిపై కాదు, దమ్ముంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటిపైన దాడి చేయాలని సూచించారు. ఒక ప్రజా ప్రతినిధి ఇంటిపైనే దాడులకు పాల్పడ్డారని సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. భయపెట్టి పాలన సాగిస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు ఏపీలో భౌతిక దాడులు పెరిగిపోయాయని డీజీపీ ఇచ్చిన క్రైమ్ రిపోర్టు చూసైనా తెలుసుకోవాలని పేర్కొన్నారు.

జగన్ ముఠా చర్యలను ఖండిస్తున్నాం
రాష్ట్రంలో అభివృద్ధిని మర్చిపోయి రెండున్నరేళ్లు గడిచిందని పేర్కొన్న ఆయన, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిపై వైసీపీ రౌడీలు దాడికి ప్రయత్నించారని రాష్ట్రాన్ని లూటీ చేసిన జగన్ పై వైసీపీ కార్యకర్తలు దాడి చేయాలని అచ్చెన్నాయుడు వారికి సూచించారు. జగన్ ముఠా చర్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. హిందూపురం పట్టణ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్ టీడీపీకి వైసీపీకి మధ్య ఘర్షణకు కారణం అయ్యింది.

డంపింగ్ యార్డ్ తరలింపు రేపిన రచ్చ
డంపింగ్ యార్డ్ ను తరలించే విషయమై జరుగుతున్న జాప్యంపై సోషల్ మీడియాలో టిడిపి నేతలు పోస్ట్ పెట్టారు. దీంతో టీడీపీ వైసిపి నేతలు పరస్పరం తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. ఈ విషయంపై చర్చ చేయడానికి వైసిపి నాయకులు బహిరంగ చర్చకు సవాల్ విసరడంతో టిడిపి నేతలు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటి వద్దకు చేరుకుని, ఎమ్మెల్యే బాలయ్య ఇల్లు ముట్టడించే ప్రయత్నం చేయగా,తెలుగుదేశం పార్టీ నాయకులు బాలకృష్ణ ఇంటికి చేరుకుని వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య బాహాబాహీ చోటు చేసుకుంది. పోలీసులు వారిని అడ్డుకున్నారు. భారీగా బాలకృష్ణ ఇంటి వద్ద పోలీసులు మోహరించారు.

హిందూపురంలో బాలయ్య ఇంటి వద్ద వైసీపీ, టీడీపీ శ్రేణుల హంగామా
జై బాలయ్య అంటూ టిడిపి శ్రేణులు, జై జగన్ అంటూ వైసీపీ శ్రేణులు నినాదాలతో హోరెత్తించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో, పరిస్థితిని పోలీసులు అదుపులోకి తీసుకొచ్చారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇంటిని వైసీపీ శ్రేణులు ముట్టడించడంపై తెలుగు తమ్ముళ్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో వైసీపీ ఏ మాత్రం పట్టించుకోవటం లేదని, ఏదైనా అభివృద్ధి జరిగితే బాలకృష్ణ స్వయంగా తన నిధులతో చేసే పరిస్థితి వచ్చిందని తెలుగు తమ్ముళ్ళు ఆరోపిస్తున్నారు.
కావాలని వైసీపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అని మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే ఘర్షణ పడుతున్నారని, దాడులకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications