మరో టీడీపీ కార్యకర్తపై చెయ్యివేసినా తీవ్ర పరిణామాలు; చంద్రయ్య హత్యతో అచ్చెన్నాయుడు వార్నింగ్
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం గుండ్లపాడులో టీడీపీ నేత చంద్రయ్య హత్యను ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. చంద్రయ్య హత్య చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హత్యా రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చాకే పల్నాడులో అరాచకాలు పెరిగిపోయాయని ఆయన పేర్కొన్నారు.
వైసీపీ అరాచకాలను సహించబోమన్న అచ్చెన్నాయుడు
ఇకపై వైసిపి అరాచకాలను సహించబోమని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు. రాష్ట్రంలో ఎంతో మంది టీడీపీ కార్యకర్తలను బలి తీసుకున్నారని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి, పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హత్యా రాజకీయాలను పెంచి పోషిస్తున్నారని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజ మెత్తారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పల్నాడులో హత్యా రాజకీయాలు ఎక్కువయ్యాయని అసహనం వ్యక్తం చేశారు. కావాలని ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
మరో టీడీపీ కార్యకర్తపై చెయ్యి వేస్తే దారుణ పరిణామాలు ఉంటాయని అచ్చెన్న వార్నింగ్
చంద్రయ్య కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. 60 లక్షల టిడిపి కుటుంబ సభ్యులందరూ చంద్రయ్య కుటుంబానికి అండగా ఉంటామని తేల్చిచెప్పారు. చంద్రయ్య హతమార్చిన వారినే కాకుండా, హత్య చేయించిన వారి పైన కూడా చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా మరో టీడీపీ కార్యకర్త పై చెయ్యి వేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరికలు జారీ చేశారు.
చంద్రయ్య హత్యపై టీడీపీ ధ్వజం .. వైసీపీ రౌడీలు అంటూ ఆగ్రహం
ఇదిలా ఉంటే టిడిపి నేత చంద్ర హత్యపై తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేదికగా ప్రజాస్వామ్యం గొంతు కోస్తున్న వైసీపీ రౌడీలు అంటూ వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మాచర్లలో టీడీపీ నాయకుడు తోటా చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇలాంటి హత్యా రాజకీయాలను సహించబోమని తేల్చి చెబుతోంది. వైసిపి అరాచకాలను ప్రశ్నిస్తున్న టిడిపి నేతలను, కార్యకర్తలను హత్య చేయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. చంద్రయ్య హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం
చంద్రయ్య దారుణ హత్య నేపథ్యంలో పోలీసుల తీరుపై ఆయన కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేత చంద్రయ్య హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామని గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు చెప్తున్నారు. నరసరావుపేట టీడీపీ ఇన్-చార్జ్ చదలవాడ అరవింద బాబు హత్యకు పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షం గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని అయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వారిపై దాడులు చేస్తున్నారని అరవింద బాబు పేర్కొన్నారు.
టీడీపీ నేత దారుణ హత్య .. కుటుంబాన్ని ఓదార్చనున్న చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్య విషయానికి వస్తే మాచర్ల టిడిపి ఇన్చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి అనుచరుడు చంద్రయ్యను నిన్న రాత్రి కొందరు దుండగులు కత్తులు, కర్రలతో దాడి చేసి హతమార్చారు. వెల్దుర్తి మండలం గుండ్లపాడు లోని చంద్రయ్య ఇంటి వద్ద ప్రస్తుత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు గుండ్లపాడు వెళ్లి చంద్రయ్య మృతదేహానికి నివాళులు అర్పించానున్నారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చనున్నారు.