ఆంధ్రాబ్యాంకు అద్దాలు ధ్వంసం: ఓపిక నశించిన ఖాతాదారులు..
గంటల కొద్ది క్యూ లైన్లో వేచియున్నా డబ్బు చేతికందే పరిస్థితి లేకపోవడంతో.. గుంటూరు జిల్లాలోని అమరావతి ఆంధ్రా బ్యాంకుపై ఖాతాదారులు దాడికి దిగారు.
గుంటూరు : నోట్ల రద్దుతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్యుల్లో ప్రస్తుతం తీవ్ర అసహనం నెలకొంది. బ్యాంకులు, ఏటీఎంల ముందు గంటల తరబడి పడిగాపులు గాచినా.. నిరాశే ఎదురవుతుండడంతో.. తీవ్ర అసహనంతో బ్యాంకులపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని అమరావతి ఆంధ్రా బ్యాంకుపై ఖాతాదారులు దాడికి దిగారు.
గంటల కొద్ది క్యూ లైన్లో వేచియున్నా.. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఖాతాదారులు. సహనం కోల్పోయి బ్యాంకుపై దాడికి పాల్పడ్డారు. డబ్బు చెల్లించాలని డిమాండ్ చేస్తూ.. బ్యాంకులోకి ప్రవేశించి అద్దాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు బ్యాంకు వద్దకు చేరుకుని ఖాతాదారులకు నచ్చజెప్పారు.

ఇదే తరహాలో పత్తిపాడులోనూ బ్యాంకు సిబ్బంది తీరుపై నిరసన వ్యక్తం చేశారు స్థానిక ఖాతాదారులు. ఖాతాదారులతో బ్యాంకు సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ బ్యాంకు ఎదుట ఆందోళనకు దిగారు. కాగా, దేశవ్యాప్తంగా నోట్ల రద్దుపై ఆందోళనలు, అసహనాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. క్యూ లైన్లో గంటలపాటు నిరీక్షించి.. అసహనంతో ఓ మహిళ టాప్ లెస్ గా మారిన ఘటన ఢిల్లీలో.. బ్యాంకు అద్దాలను ధ్వంసం చేసిన ఘటన యూపీలో.. ఏటీఎంకు అంత్యక్రియలు నిర్వహించిన ఘటన కేరళలో.. ఇలా.. దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్రతరం అవుతున్నాయి.












Click it and Unblock the Notifications