హెటిరోలో దొరికిన సొమ్మంతా జగన్ దే; విరుచుకుపడిన అయ్యన్న పాత్రుడు, యనమల
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. హెటిరోలో దొరికిన సొమ్మంతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. 147 కోట్ల రూపాయలు మాత్రమే కాదని ఇంకా వేల కోట్ల డబ్బులు దాచారని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి సీఎంగా అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో దోచిన సొమ్మని అయ్యన్న ఆరోపించారు. హెటిరో డ్రగ్స్ లో ఐటి అధికారులు జరిపిన సోదాల్లో భారీగా నగదు పట్టుబడడంతో హెటిరో చీఫ్ పార్థసారధి రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి లింకు పెట్టి టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
ఈక్రమంలోనే అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు.
అవసరం అయితే సీఎం జగన్ మల్లెపూల వ్యాపారం కూడా చేస్తారు
హెటిరో డ్రగ్స్ లో దొరికిన సొమ్మంతా జగన్మోహన్ రెడ్డిదే అని, ప్రజల అవసరమే తమ ఆయుధంగా కరోనా మహమ్మారి సమయంలో జలగల్లా పట్టి పీడించి నోట్ల కట్టలు గుట్టలుగుట్టలుగా పెట్టిన వైట్ కాలర్ క్రిమినల్స్ జగన్ రెడ్డి, హెటిరో పార్థసారధి రెడ్డి అంటూ నిప్పులు చెరుగుతున్నారు. టీడీపీ నేతలు మరోమారు జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. అంతేకాదు గతంలోనూ సీఎం జగన్మోహన్ రెడ్డి పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు మళ్లీ మరోమారు మల్లెపూల వ్యాపారాన్ని ప్రస్తావించారు. సీఎం జగన్ మల్లె పూలు కూడా అమ్ముకుంటారు అంటూ ఎద్దేవా చేశారు.

జైల్లో చిప్పకూడు తినేవారికి పాలన ఏం తెలుస్తుంది
విశాఖలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలను 25 వేల కోట్లకు తాకట్టు పెట్టారని అయ్యన్నపాత్రుడు విమర్శలు గుప్పించారు. జగన్ పార్టీకి ఏ ప్రజలైతే అన్ని సీట్లు ఇచ్చి గెలిపించారో అదే ప్రజలు భవిష్యత్తులో కొట్టే పరిస్థితి వస్తుందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయానికి మించిన అప్పులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జైలులో చిప్పకూడు తినేవారికి పాలన పై అవగాహన ఏముంటుందని అయ్యన్నపాత్రుడు ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి మోసం చేశారని అయ్యన్నపాత్రుడు మండిపడ్డారు.
రాష్ట్రంలో అప్పులు ఫుల్ అభివృద్ధి నిల్ : యనమల రామకృష్ణుడు
మద్యం మాటున ముఖ్యమంత్రి దోపిడీ చేస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన మాటలు వాస్తవమని అయ్యన్నపాత్రుడు అభిప్రాయపడ్డారు. సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారంటూ అయ్యన్నపాత్రుడు ఆరోపణలు గుప్పించారు. టీడీపీ మాజీ మంత్రి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కూడా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ని టార్గెట్ చేశారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేస్తున్నారని మండిపడిన యనమల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పులు ఫుల్ అభివృద్ధి నిల్ అంటూ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు జగన్ ను ఆదరించరని టిడిపి విజయం సాధిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.
హెటిరో సంస్థల్లో దాడులు .. 550 కోట్ల రూపాయల బ్లాక్ మనీ గుర్తింపు
ఇదిలాఉంటే ఇటీవల హెటిరో సంస్థలో ఐటి అధికారులు జరిపిన సోదాల్లో భారీగా నగదు పట్టుబడిందని అందరికీ తెలిసిందే. ఈ దాడుల్లో 550 కోట్ల రూపాయల బ్లాక్ మనీ గుర్తించారు. ఇందులో 147 కోట్ల రూపాయలను సీజ్ చేశారు. ఆరు రాష్ట్రాలలో హెటిరో సంస్థల్లో 60 చోట్ల నాలుగు రోజులపాటు జరిపిన ఐటీ దాడుల్లో అపార్ట్మెంట్లలో ఫ్లాట్లను కొనుగోలు చేసి వందలకొద్దీ అట్టపెట్టెలో నగదును దాచిపెట్టడాన్ని ఐటి అధికారులు గుర్తించారు. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడటం సంచలనం సృష్టించింది.












Click it and Unblock the Notifications