సిఎం తీర్మానంపై ఓటింగ్ తప్పదు కానీ, స్టడీచేశా: స్పీకర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన తీర్మానం పైన ఓటింగ్ తప్పదని శాసన సభ సభాపతి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లును తిరస్కరించాలని, దీనిని పార్లమెంటులో ప్రవేశ పెట్టకుండా తోసి పుచ్చాల్సిందిగా రాష్ట్రపతిని కోరాలని ముఖ్యమంత్రి తీర్మానం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ, సీమాంధ్ర నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది.
ఈ నేపథ్యంలో మంగళవారం బిఏసి సమావేశమైంది. ఈ సమావేశంలో సభాపతి తీర్మానం తప్పదని చెప్పారు. అయితే విభజన బిల్లులోని క్లాజులకు వచ్చిన సవరణలపై ఓటింగ్ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్, బీహార్ అసెంబ్లీల్లో అనుసరించిన పద్ధతులు, విధానాలను ప్రస్తావించారు.
మంగళవారం జరిగిన శాసనసభ వ్యవహారాల సంఘం (బిఏసి) భేటీలో సభ్యులకు నాలుగు పేజీల నోట్ అందించారు. ఇదే విషయాన్ని బిఏసి సమావేశానికి హాజరైన నేతలకు తెలిపారు. సభ నాయకుడిగా సిఎం నోటీసుకు ప్రాధాన్యం ఉంటుందని, అయితే దీనిపై సభ అభిప్రాయం కూడా తీసుకుంటామని చెప్పారు. బిల్లుపై శాసనసభ్యులు వెల్లడించిన అభిప్రాయాలను సారాంశం రూపంలో పంపాలని కోరారని అయితే, సారాంశం కాకుండా అభిప్రాయాలను యథాతథంగా తర్జుమా చేసి పంపాలని నిర్ణయించామని తెలిపారు.
మంగళవారం స్పీకర్ చాంబర్లో నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సిఎం ఇచ్చిన నోటీసుకు, ఇతర అంశాలపై స్పీకర్ నేతలకు ఒక నోట్ అందించారు.
ప్రభుత్వ తీర్మానం ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి నుంచి 77వ నిబంధన ప్రకారం తనకు నోటీసు అందిందని, ఉత్తరప్రదేశ్, బీహార్ అసెంబ్లీల్లోనూ ఇలాంటి తీర్మానాలపై ఓటింగ్ జరిగిన ఉదంతాలు ఉన్నాయని, రాష్ట్ర శాసనసభలోనూ నిబంధన 77 కింద నోటీసులు ఇచ్చారని, తమ అభిప్రాయాలను తెలియజేసేందుకు వీలుగా తీర్మానాలు ప్రవేశ పెట్టారని, ఓ అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం లేదా సభ సిఫారసే తీర్మానం అవుతుందని చెప్పారు.
ఏ సభ్యుడైనా నోటీసు ఇవ్వాలనుకుంటే లిఖితపూర్వకంగా దాన్ని అందజేయాల్సి ఉంటుందని, అలాంటి నోటీసు నియమ, నిబంధనల ప్రకారం ఉందా లేదా అని పరిశీలిస్తామని, అమలులో ఉన్న విధానాలు, పద్ధతులను పరిశీలించి చర్చకు సమయం కేటాయిస్తామని చెప్పారు. అనధికార తీర్మానాలు, ప్రభుత్వ తీర్మానాలు ఉంటాయన్నారు. మంత్రులు మినహా ఇతర సభ్యులు ఇచ్చేవన్నీ అనధికార తీర్మానాలేనని, మంత్రి ప్రతిపాదించే తీర్మానం ప్రభుత్వ తీర్మానం అవుతుందన్నారు.
అనధికార తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకుంటే దాన్ని ప్రభుత్వానికి పంపి, ఓటింగ్ పెట్టి, ఆ తర్వాత అవసరమైతే చర్చకు సమయం కేటాయిస్తారని, ప్రభుత్వ తీర్మానాలను చేపట్టే విధానం దీనికి భిన్నంగా ఉంటుందన్నారు. ఈ తీర్మానాలకు నిర్దేశిత గడువుకు ముందు నోటీసు ఇవ్వాల్సిన అవసరం కానీ లాటరీ పద్ధతిలో ఎంపిక చేయాల్సిన అవసరం కానీ ఉండదని నాదెండ్ల వివరించారు.
రాష్ట్రాల విభజన పూర్తిగా కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ పరిధిలోని అంశమని స్పీకర్ తన నోట్లో తెలిపారు. బిల్లుపై కానీ, క్లాజులపై కానీ శాసనసభలో నేరుగా ఓటింగ్ పెట్టడం కుదరదని చెప్పారు. అయితే బిల్లు, క్లాజులపై తమ అభిప్రాయాలను చెబుతూ తీర్మానాల కోసం నోటీసులను లిఖితపూర్వకంగా తెలియజేయవచ్చన్నారు.