Badvel bypoll: అలా జరిగితే..వైసీపీ క్లీన్స్వీప్: కేంద్ర బలగాలు కావాలి: సోము వీర్రాజు డిమాండ్
కడప: కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించబోయే ఉప ఎన్నిక విషయంపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. స్థానిక పోలీసులపై తమకు ఏ మాత్రం నమ్మకం లేదని ఆరోపిస్తోంది. స్థానిక పోలీసులతో పోలింగ్ను నిర్వహించడమంటూ జరిగితే అది అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే- కేంద్ర బలగాలను రంగంలోకి దింపాలని డిమాండ్ చేస్తోంది. కేంద్ర బలగాలతో పరేడ్ను నిర్వహించాలని కోరుతోంది.
వినతిపత్రంలో కీలక విషయాలు..
ఈ మేరకు బీజేపీ నాయకులు కేంద్ర ఎన్నికల పరిశీలకుడు భీష్మకుమార్ను కలిసి వినతిపత్రాన్ని అందించారు. పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో అధికార పార్టీ ఆగడాలు మితి మీరాయని, పోలీసులు ఆ పార్టీ నాయకులకే వత్తాసు పలుకుతున్నారని అన్నారు. ఓటర్లు కూడా భయాందోళనల మధ్య ఉంటున్నారని చెప్పారు.
తిరుపతిలో అనుభవమైంది..
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని- కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం నియమించే బలగాల ద్వారా ఉప ఎన్నికను నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర బలగాలతో పరేడ్ చేపట్టాలని కోరారు. ఇదివరకే ఒకసారి తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో తాము ఇలాంటి అనుభవాన్ని చవి చూశామని బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక పరిధిలో అధికార పార్టీ నాయకులు భారీగా దొంగఓట్లను వేయించారని విమర్శించారు. మాల్ ప్రాక్టీస్కు పాల్పడ్డారని ఆరోపించారు.
214 పోలింగ్ బూత్లల్లో వెబ్ కెమెరాలు..
దీనికి సంబంధించిన పలు ఆధారాలను తాము ఎన్నికల పరిశీలకుడికి అందజేశామని సోము వీర్రాజు అన్నారు. 214 పోలింగ్ బూత్లల్లో వెబ్ కెమెరాలను అమర్చారని అన్నారు. కేంద్రీయ రిజర్వ్ పోలీసు బలగాలను మోహరింపజేశారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. డ్వాక్రా సంఘాలు, యానిమేటర్లతో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తోందని విమర్శించారు.
ప్రలోభాలకు పాల్పడుతూ..
ఇప్పటికే పోలీసులు వైసీపీ నేతల కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. బీజేపీ నేతలపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వలంటీర్ల ద్వారా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. బద్వేలు ఉప ఎన్నికను స్థానిక పోలీసులతో నిర్వహిస్తే ఏకపక్షంగా జరిగే అవకాశముందని అన్నారు. ఇలాంటి వాతావరణంలో పోలింగ్ నిర్వహించడం ఏ మాత్రం సహేతుకం కాదని చెప్పారు.
బెదిరింపులు.. అరాచకాలు..
ఉప ఎన్నిక ప్రచారంలో వైసీపీ నాయకులు.. తమ ప్రభుత్వం చేసిన మంచి పనులు చెప్పి ఓట్లు అడగకుండా వలంటీర్లు, పోలీసు అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రుల సహకారంతో ఓటర్లను ఆకట్టుకోవడానికి అక్రమాలకు పాల్పడుతున్నారని సోము వీర్రాజు విమర్శించారు. ఓటర్లను బెదిరించి, భయపెట్టి, ప్రలోభాలకు గురి చేసి, అరాచకాలను సృష్టించి ఓట్లు దండుకోవాలని ప్రయత్నిస్తున్నారని చెప్పారు. తమ పార్టీకి ఏజెంట్లను లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
ఆదినారాయణ రెడ్డి సహా..
కేంద్ర ఎన్నికల కమిషన్ పంపిన బలగాల ద్వారా పరేడ్ నిర్వహించి ఓటర్లలో విశ్వాసం పెంచాలని కోరారు. వైసీపీ నేతల ఆగడాలను నియంత్రించాలని కోరారు. అన్ని స్థాయిల్లో పోలీసులను ఎన్నికల విధుల నుంచి తొలగించాలని, వలంటీర్లను నిలువరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల పరిశీలకుడు భీష్మకుమార్ను కలిసిన వారిలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర ఇంఛార్జ్ సునీల్ దియోదర్, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి, ఎస్ విష్ణువర్ధన్ రెడ్డి, మాధవ్ ఉన్నారు.