ఫ్యాన్స్కి బాలకృష్ణ, హీరో విరాళం కోటి, బాబు వెనక్కి
హైదరాబాద్: తన అభిమానులు హుధుద్ తుఫాను బాధితులను ఆదుకోవాలని, భారీగా విరాళాలు ఇవ్వాలని తెలుగు హీరో, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణ శుక్రవారం విజ్ఞప్తి చేశారు. విజయనగరం జిల్లాలోని తిప్పలవలస, కోనాడలో బాలకృష్ణ పర్యటించారు. బాధితులను పరామర్శించారు. సినీ పరిశ్రమ తరఫున కార్యక్రమం ఏర్పాటు చేసి విరాళాలు సేకరిస్తామని చెప్పారు.
హీరో సంస్థ రూ.కోటి విరాళం
హుధుద్ తుపాను బాధితుల పరిస్థితి పట్ల హీరో మోటో కార్ప్ స్పందించింది. ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు చెక్కును కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, ఎంపీ కంభంపాటి హరిబాబులకు అందజేశారు.
ఎపీఎన్జీవో ఉద్యోగుల విరాళం రూ.125 కోట్లు
ఏపీఎన్జీవోలు రూ.125 కోట్ల విరాళం ప్రకటించారు. నవంబర్ నెలలో రెంజు రోజుల విరాళం తీసుకోవాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు సీఎస్కు లేఖ రాశారు. ఏపీఎన్జీవోల రెండు రోజుల విరాళం రూ.125 కోట్లు అవుతుందని చెప్పారు.
పాడేరులో పర్యటించిన చంద్రబాబు
హుధుద్ తుపాన్ వల్ల దెబ్బతిన్న పాడేరులో చంద్రబాబు శుక్రవారం పర్యటించారు. అక్కడి ప్రజల కష్టాలను తెలుసుకుని వారికి ధైర్యం చెప్పారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని, ఇక్కడ ఉండే గిరిజనులకు న్యాయం చేస్తామన్నారు.
ఇక్కడ పిల్లల చదువు కోసం కాలేజీ కట్టిస్తామన్నారు. మాటలు చెప్పేవారు పనులు చేయరని, పనులు చేసేవారు మాట్లాడరని, నేను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు
పాడేరులో చిరు జల్లులు పడి ఆకాశం మేఘావృతమై ఉండడంతో చంద్రబాబు తన పర్యటనను కుదించుకున్నారు. వర్షం పడితే హెలికాఫ్టర్ ఎగరదని ఫైలెట్ చెప్పడంతో ఇరిగాపల్లి నుంచే చంద్రబాబు వెనుదిరిగారు. పాడేరు నుంచి విశాఖకు బయలుదేరారు. అరకులో తుపాన్ మృతుల కుటుంబాలకు చంద్రబాబు రూ. 25 లక్షల చెక్కును అందజేశారు.