వారి వెనుక బాలకృష్ణ, పవన్ జనసేనపై చిరంజీవి సెటైర్
హైదరాబాద్: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీమాంధ్ర ప్రచార కమిటీ చీఫ్ చిరంజీవి ఆదివారం తన సోదరుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతల బస్సుయాత్ర సీమాంధ్రలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జనసేన పార్టీపై చిరు అభిప్రాయాన్ని విలేకరులు అడిగారు. తాను జనసేన పార్టీని ఆహ్వానిస్తున్నాని చిరు చెప్పారు. అదే సమయంలో ఆయన ఆసక్తికరమై వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో ఎన్ని కొత్త పార్టీలు వస్తే అంత మంచిదని, ఎక్కువ పార్టీలు వస్తే ఆశావహులకు టిక్కెట్లు లభిస్తాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ రాజకీయాల్లోకి రావాలని చిరు పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ద్వారా కొంతమందికి అవకాశం రావచ్చునని అన్నారు. అయితే, పార్టీలు పుట్టుకు వస్తే ఆశావహులకు టిక్కెట్లు ఇస్తామని చెప్పిన చిరంజీవి జనసేన పార్టీని ఎద్దేవా చేసినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
పురంధేశ్వరి వెనుక బాలకృష్ణ ఉన్నారా?
కొద్ది రోజుల క్రితం కాంగ్రెసు పార్టీలో చేరిన మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ లోకసభ స్థానంపై దృష్టి సారించారనే ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. పురంధేశ్వరి బిజెపిలోకి చేరడం వెనుక ఆమె సోదరుడు, టిడిపి నేత నందమూరి బాలకృష్ణ ఉండి ఉంటారని అంటున్నారు.

సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉండటంతో... బిజెపిలో చేరి, ఆ పార్టీ టిక్కెట్ పైన టిడిపి మద్దతుతో గెలవవచ్చునని బాలయ్య సూచించారని వినికిడి. ఇప్పటికే బిజెపి నాయకత్వం విజయవాడ పార్లమెంటు సీటును తమకు వదిలేయాలని టిడిపిని కోరినట్లుగా తెలుస్తోంది.
బాలయ్య సూచన మేరకు బిజెపిలో చేరిన ఆమె ఇప్పుడు విజయవాడ పైన ప్రత్యేక దృష్టి సారించారని అంటున్నారు. మరోవైపు కేంద్ర జౌళీశాఖ మంత్రి కావూరి సాంబశివ రావు కూడా విజయవాడ టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన టిడిపి తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
విజయవాడ కాకపోయినా మచిలీపట్నం నుండి టిడిపి టిక్కెట్ పైన పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారట. అయితే, కావూరి చేరికను టిడిపి స్థానిక నాయకత్వం వ్యతిరేకిస్తోంది. అయితే, బాలయ్యతో కావూరికి మంచి సంబంధాలు ఉన్నాయి. హీరో మద్దతుతో టిడిపిలోకి ఎంట్రీ ఇచ్చేందుకు కావూరి ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు.












Click it and Unblock the Notifications