బెంగళూరులో జగన్ ను బాలినేని కలిశారా ? తేల్చేసిన జనసేన..!
ఏపీలో ఒకప్పుడు వైఎస్ జగన్ కు సమీప బంధువు, వైఎస్సార్సీపీలో మంత్రిగా, కీలక నేతగా ఓ వెలుగు వెలిగిన ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy).. ఆ పార్టీ అధికారం కోల్పోయాక జనసేనలోకి వెళ్లిపోయారు. అక్కడే తన రాజకీయ భవిష్యత్తును వెతుక్కుంటున్నారు. అయితే గత కొంతకాలంగా జనసేన కార్యక్రమాల్లో బాలినేని కనిపించకపోవడం, బెంగళూరు వెళ్లి తన మాజీ బాస్ వైఎస్ జగన్ ను కలిసి వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై జనసేన ఎట్టకేలకు స్పందించింది.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి మీద జరుగుతున్న అబద్ధపు, విష ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఏపీ టిడ్కో ఛైర్మన్, జనసేన సంక్షోభ నిర్వహణ కమిటీ నేత అజయ్ కుమార్ తెలిపారు. బాలినేని జనసేన పార్టీలో చేరిన మరుసటి రోజు నుంచే ఆయన మీద ఈ ప్రచారం మొదలు పెట్టారని విమర్శించారు. ఆయన జనసేన పార్టీలో ఎక్కువ రోజులు ఉండరు అని ఒకరు, ఆయన వైకాపా కొవర్ట్ అని మరొకరు, ఇలా ఎవరికి తోచినరీతిలో వారు మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. ఇప్పుడు గత కొద్ది రోజులుగా, బాలినేని బెంగుళూరులో జగన ను కలిసినట్టు, తిరిగి వైకాపా లోకి వెళ్తునట్టు ఒక అబద్దపు, విషపూరితమైన ప్రచారం మొదలుపెట్టారని తెలిపారు. ఈ ప్రచారం ఒక రాజకీయ పక్షానికో లేదా ఒక వర్గానికో కొమ్ము కాసే చానల్స్ చేస్తున్నాయని సులభంగా అర్ధమవుతోందన్నారు.

కొంత మంది యూట్యూబర్లు ఎవరి ప్రోద్భలంతోనో, లేదా ఏ లాభం కోరి ఇటువంటి వార్తలు వ్రాస్తున్నారో తెలియదుకానీ, బాలినేని శ్రీనివాస్ గారి మీద వారు చేసే ఈ అబద్ధపు, విష ప్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాలినేని గారు మా జనసేన పార్టీలో చేరిన మరుసటి రోజు నుంచే ఆయన మీద ఈ ప్రచారం మొదలు… pic.twitter.com/nN5BhOKLHz
— Ajaya Kumar Janasena (@AjayaKumarJSP) September 15, 2026
బాలినేని జగన్ ని కలిసిందీ లేదు, అసలు జనసేన పార్టీని వదలాలి అనే ఆలోచనాలేదని అజయ్ కుమార్ తేల్చేశారు. ఈ మాట తాను చాలా భాద్యతతో మాట్లాడుతున్నానని తెలిపారు. బాలినేని రాజకీయంగా ఒక పెద్దస్ధాయి ఉన్న నాయకుడని, అలాంటి నాయకుడు జనసేన పార్టీ ఎదుగుదలకు చాలా అవసరమని ఎంతో మక్కువతో స్వయానా పవన్ కళ్యాణ్ ఆహ్వానించి పార్టీలో చేర్చుకున్నారన్నారు. బాలినేనికి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా గౌరవం, ఇష్టం కూడా అన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి మన రాష్రానికి నాయకత్వం వహిస్తే, దేశ రాష్ట్రాలలో మన రాష్ట్రం ఉన్నత స్ధాయిలో ఉంటుంది అని గాఢంగా నమ్మే వ్యక్తి బాలినేని అన్నారు. అలాగే జనసేన కార్యకర్తలకు కూటమి ప్రభుత్వంలో తగిన న్యాయం జరిగే విధంగా నిబద్ధతతో, నిబ్బరంగా కార్యకర్తల పక్షాన నిలబడే ధైర్యం ఉన్న వ్యక్తి బాలినేని అన్నారు. అందుకే అటు విపక్షాలు, ఇటు స్వపక్షంలోని కొన్ని వర్గాలు ఆయన మీద ముప్పేట దాడి చేస్తూనే ఉన్నాయన్నారు. ఎవరేమనుకున్నా, ఎన్ని కుతంత్రాలు చేసినా, బాలినేని మాత్రం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీలో ఒక బలీయమైన నాయకుడుగా పార్టీకి, మన రాష్రానికి సేవలు అందించడం ఖాయమన్నారు.














Click it and Unblock the Notifications
