పవన్ కళ్యాణ్ పోరాటం ఎవరి పైన: సుమన్, మమ్మల్ని కాదు: పల్లె
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎవరి పైన పోరాటం చేస్తున్నారో చెప్పాలని తెరాస ఎంపీ బాల్క సుమన్ గురువారం అన్నారు. భూసేకరణ పైన ఏపీ సీఎం చంద్రబాబును నిలదీయాలన్నారు. సీమాంధ్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు కరీంనగర్లో పర్యటించారన్నారు. ఏపీలో బాబు పైన ప్రజల్లో నమ్మకం పోయిందని చెప్పారు.
తెరాస ప్రభుత్వం పైన కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు సరికాదన్నారు. తెలంగాణ కోసం ఉద్యమించని నేతలు ఇప్పుడు పదవుల కోసం పెదవి విప్పుతున్నారని ఆరోపించారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డి పైన పొన్నం ప్రభాకర్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఆయన ఆరోపణలకు ఆధారాలు లేవన్నారు. జై తెలంగాణ అని చెప్పని షబ్బీర్ అలీ కేసీఆర్ పైన ప్రశ్నించడమేమిటన్నారు.
పవన్ ప్రభుత్వాన్ని విమర్శించలేదు: మంత్రి
పవన్ ప్రభుత్వాన్ని విమర్శించలేదని రాష్ట్ర సమాచారా శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు. రైతుల వద్ద నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు సేకరించడం లేదని చెప్పారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేపడుతోందన్నారు. ప్రపంచస్ధాయి రాజధాని నిర్మాణం కోసమే 32 వేల ఎకరాలు సేకరించామని మంత్రి అన్నారు.