ఏపీలో ప్లాస్టిక్ బ్యాగ్ లపై నిషేధం అమల్లోకి.. ఫ్లెక్సీలు, బ్యానర్లపై నిషేధం అప్పటి నుండే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ప్లాస్టిక్ వినియోగం పై సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఏపీలో ప్లాస్టిక్ నిషేధం దిశగా ముందుకు వెళుతున్న ఏపీ ప్రభుత్వం ప్లాస్టిక్ బ్యానర్లపై విధించిన నిషేధం జనవరి 26 2023 నుండి అమల్లోకి రానుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన ఫ్లెక్సీలు, బ్యానర్ల నిషేధం ఈనెల 26వ తేదీ నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో, నిబంధనల అమలును తనిఖీ చేయడం కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ విభాగాలను ఏర్పాటు చేసింది.
ఇక ఫ్లెక్సీల ప్రింటింగ్, మరియు ఫ్లెక్సీల వినియోగం పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్ఫోర్స్మెంట్ విభాగం నగరాలు, పట్టణాలు, పంచాయతీలలో బృందాలుగా ఏర్పడి తనిఖీలను నిర్వహించనున్నారు. ఇక అంతే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ 31వ తేదీ నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిషేధం అమల్లోకి వచ్చింది. ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ సంచులు తయారీ, వినియోగంపై కేంద్ర ప్రభుత్వం విధించిన నిషేధం అమలులోకి వచ్చింది.

120 మైక్రాన్లు లేదా ఆపై మందం కలిగిన ప్లాస్టిక్ సంచులను మాత్రమే వాడాలని, 120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ సంచులు, క్యారీ బ్యాగులు తయారు చేసినా, దిగుమతి చేసుకున్నా, విక్రయించినా, వాడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ ను ఉపయోగించడం వల్ల పర్యావరణానికి ఎంత హాని కలుగుతుందో కూడా ప్రజలకు అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తామని చెబుతున్నారు.
ఇప్పటి వరకు 75 మైక్రాన్ల మందం కలిగిన క్యారీ బ్యాగ్ లను వినియోగించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయంతో 120 మైక్రాన్ల బరువు కలిగిన ప్లాస్టిక్ సంచులను మాత్రమే వినియోగించాలని ఆదేశాలు జారీ చేశారు. 120 మైక్రాన్ల కంటే తక్కువ బరువు ఉన్న ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నారు.












Click it and Unblock the Notifications