బంద్ మా పార్టీ విధానం కాదు కానీ: పవన్ కళ్యాణ్ ప్రకటన, 'త్వరలో సినీ-టీవీ ఆర్టిస్ట్ల దీక్ష!'
అమరావతి: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ సోమవారం చేపట్టిన ఒక రోజు బందును విజయవంతం చేసినందుకు రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా తప్పనిసరి అని, ఇది తాము సాధించుకునే హక్కు అనే ప్రజానీకం అభీష్టాన్ని ఈ బంద్ వెల్లడించిందన్నారు.
ఈ కార్యక్రమం శాంతియుతంగా సాగిందని చెప్పారు. ఇదే స్ఫూర్తితో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాలని చెప్పారు. ప్రజలకు అసౌకర్యం కలిగించే బంద్ లాంటివి చేయడం మా పార్టీ విధానం కాదని వెల్లడించారు. అయితే ప్రత్యేక హోదా సాధన మన రాష్ట్రానికి చాలా ముఖ్యమైనదని, అందుకే నిరసన బలంగా తెలపడానికి ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బందు పిలుపుకు మద్దతుగా నిలిచామని చెప్పారు.
బంద్ శాంతియుతంగా నిర్వహించిన పార్టీ శ్రేణులకు అభినందనలు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా కోసం చేసిన ఏపీ బంద్ విజయవంతమైందని చలసాని శ్రీనివాస్ అన్నారు. బంద్ విజయవంతమైందంటే హోదా ఆకాంక్ష ప్రజల్లో ఎంతగా ఉందో తేలిపోయిందన్నారు.
టీవీ, సినిమా పరిశ్రమతో కలిసి ఆందోళన
ప్రత్యేక హోదా కోసం సినిమా పరిశ్రమ, టీవీ పరిశ్రమతో కలిసి ఆందోళనలు నిర్వహిస్తామని ఏపీ సినీ నాటక సంఘ అభివృద్ధి సంస్థ చైర్మన్ అంభికా కృష్ణ అన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు 171వ జయంతి సందర్భంగా రంగస్థల పురస్కారాలను ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రత్యేక హోదా విషయంలో టీవీ ఆర్టిస్టులు అందరినీ ఒకే రైల్వే బోగీలో తీసుకొని ఢిల్లీకి వెళ్లి అక్కడ ఒకరోజు నిరాహార దీక్ష చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సినిమా ఆర్టిస్టులు కూడా తమ ఆందోళనకు మద్దతు తెలుపుతున్నారని, ఈ నెల 22వ తేదీ లోపు నటీనటులు అందరూ విజయవాడకు వచ్చి పాదయాత్ర చేయడమో లేక ఒకచోట కూర్చొని నిరసన తెలపడమో చేస్తారన్నారు.












Click it and Unblock the Notifications