ఎపిలో మూతపడుతున్న బ్యాంకులు...షాకింగ్...కానీ నిజం...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో బ్యాంకుల సంఖ్య తగ్గిపోతుందా...రాష్ట్రంలో అనేక బ్యాంకులు మూతపడ్డాయా...అంటే నిజమేనంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు...షాకింగ్ గా ఉన్నా ఇది నిజం...కారణాలేంటంటే...
రాష్ట్రంలో బ్యాంకుల సంఖ్య రాన్రానూ తగ్గిపోతోంది. గడచిన మూడు నెలల వ్యవధిలోనే గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో బ్యాంకుల సంఖ్య గణనీయంగా తగ్గడం కనిపించింది. ఇలా గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒక్కసారిగా బ్యాంకుల సంఖ్య తగ్గుముఖం పట్టడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో మాత్రం బ్యాంకుల సంఖ్యలో కొంత పెరుగుదల ఉన్నా, మొత్తం మీద చూసినప్పుడు గతంలో కంటే ఇప్పుడు బ్యాంకులు తగ్గాయి. ఇలా బ్యాంకుల సంఖ్య తగ్గడానికి ఆయా బ్యాంకులు భిన్న కారణాలు చెబుతున్నాయి.

ఇవేనా కారణాలు...
ఎటిఎంలు, నెట్ బ్యాంకింగ్ వినియోగం బాగా పెరగడం బ్యాంకుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధానకారణమని, మరికొన్ని చోట్ల వ్యాపారం అనుకున్న స్థాయిలో జరగకపోతుండటం కూడా మరో కారణమని బ్యాంకుల అధికారులు చెబుతున్నారు. అలాగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లోనూ బ్యాంకులు మూత పడుతున్నాయని తెలిపారు.

బ్యాంకుల సంఖ్యలో హెచ్చుతగ్గులు...
గత ఏడాది సెప్టెరబర్ నాటికి రాష్ట్రంలో 7007 బ్యాంకు బ్రాంచ్ లు ఉండగా, ఈ ఏడాది మార్చి నాటికి వాటి సంఖ్య 7158 వరకు పెరిగింది. జూన్ నాటికి 7178 శాఖలకు పెరగగా, మళ్లీ సెప్టెంబర్ వచ్చేసరికి 11 శాఖలు మూసివేసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా మూసివేత సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో జూన్ నాటికి 2743 శాఖలు ఉండగా, సెప్టెంబర్ నాటికి 42 శాఖలు మూతపడ్డాయి. అలాగే పట్టణప్రాంతాల్లో జూన్ నాటికి 1893 శాఖలు ఉండగా, సెప్టెంబర్ నాటికి వాటి సంఖ్య 1854కు పడిపోయింది. మొత్తం మీద 3 నెలల్లో 39 శాఖలు తగ్గినట్లయింది.

సెమీ అర్భన్లో పెరుగుదల...
అయితే సెమీ అర్బన్ ప్రాంతాల్లో మాత్రం బ్యాంకుల శాఖలు బాగానే పెరిగాయి. ఆయా ప్రాంతాల్లో జూన్ నాటికి మొత్తం 2118 శాఖలు ఉండగా, సెప్టెంబర్ నాటికి వాటి సంఖ్య 2167 శాఖలకు పెరిగింది.

ఇది కామనే...
బ్యాంకులు వ్యాపార ధోరణితోనే పనిచేస్తాయని, వ్యాపారం సక్రమంగా లేని ప్రాంతాల్లో శాఖల మూసివేత సాధారణమేనని బ్యాంకు అధికారులు అంటున్నారు. బిజినెస్ లేనిచోట బ్యాంకుల మూసివేత అనివార్యమని తేల్చి చెబుతున్నారు. ఎటిఎంలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాకింగ్ తో చాలామంది బ్యాంకులకు వెళ్లడం తగ్గించేశారని, ఇది కూడా చాలా కీలకమైన అంశమని అంటున్నారు. దీనివల్ల బ్రాంచులు తగ్గినా బిజినెస్ పెరుగుతూనే ఉంటుందని, ఈ విషయం గమనించాలని చెబుతున్నారు.

డిపాజిట్లు...అప్పులు...
రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకుల్లో డిపాజిట్లు భారీగా పెరగగా, బ్యాంకులు ఇస్తున్న రుణాలు మాత్రం గతంతో పోలిస్తే నామమాత్రంగానే పెరిగినట్లు రికార్డులు తేటతెల్లం చేస్తున్నాయి. బ్యాంకుల్లో జూన్ నాటికి రూ.2.62 లక్షల కోట్ల డిపాజిట్లు నమోదుకాగా, సెప్టెంబర్ నాటికి అవి రూ.9314 కోట్లుకు పెరిగినట్లు గుర్తించారు. అలాగే అడ్వాన్సుల విషయానికి వస్తే జూన్ నాటికి రూ.2.77 లక్షల కోట్లు రికార్డు కాగా, సెప్టెంబర్ నాటికి కేవలం రూ.1102 కోట్లు మాత్రమే పెరిగాయి. వీటిలో ప్రాధాన్యతా రంగాలకు ఇవ్వాల్సిన రుణాల్లో రూ. 2647 కోట్లు అధికంగా కాగా, మిగిలిన రంగాలకు బాగా తగ్గిపోయాయి.

చిన్నపరిశ్రమల పట్ల అనాసక్తి...
ప్రభుత్వం కూడా ప్రధానంగా పెద్ద పరిశ్రమలపై ప్రధానంగా దృష్టి సారిస్తుందే తప్ప చిన్న,మధ్య తరహా పరిశ్రమలపై ఆసక్తి చూపకపోవడం కూడా రుణాల తగ్గుదలకు కారణమని తెలుస్తోంది. బ్యాంకులు గత ఏడాది సెప్టెంబర్ వరకు దాదాపు రూ.41 వేల కోట్లు రుణాలు పంపిణీ చేయగా, ఈ ఏడాది మార్చి వరకు రూ. 44 వేల కోట్లు పంపిణీ అయ్యాయి. అయితే ఈ ఏడాది సెప్టెంబర్కి కేవలం రూ. 40 వేల కోట్లు మాత్రమే రుణాలు ఇవ్వడంతో బ్యాంకులు లక్ష్యంలో బాగా వెనుకబడినట్లు కనిపిస్తోంది. దీనిని పెరచాల్సిన అవసరం ఉందని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు కానీ ఆచరణలో పాత పద్దతులే కొనసాగుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications