మావాళ్లేనని చెప్పి..: తెలంగాణ సిఎం కెసిఆర్పై ఆగ్రహం
హైదరాబాద్: నాడు అందరు తమ వాళ్లేనని చెప్పి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎందుకు మాట మారుస్తున్నారని బీసీ సంఘాలు ప్రశ్నించాయి. ప్రతిపక్షంలో ఉండగా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అన్న తెరాస... అధికారంలోకి రాగానే స్థానికత, సెంటిమెంటు పేరుతో పథకానికి తూట్లు పొడిచేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని బీసీ సంఘాలు శనివారం హెచ్చరించాయి.
1956 స్థానికతను ప్రామాణికంగా తీసుకోవాలని కేసీఆర్ అధికారులకు సూచించడమంటే పొమ్మనకుండా పొగబెట్టడమేనన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డా మా వాడే, హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చెయ్యవద్దని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు 1956 అనడం ఎంతవరకు సమంజసమన్నారు. బీసీ యువజనసంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేశ్ యాదవ్, బీసీ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు దుర్గయ్య, బీసీ న్యాయవాదుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్, బీసీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ ప్రశ్నించారు.
జాతీయస్థాయిలో ప్రతిష్టాత్మకమైన ఐఐటీ, ఐఐఎం, బిట్స్ తదితర కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఆర్థికస్తోమత లేక, ఫీజులు చెల్లించలేక చదువులు మానేస్తున్నారని బీసీ సంక్షేమ సంఘం కేంద్ర కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కోర్సులు చదివే నైపుణ్యం ఉన్నా ఆర్థిక స్తోమత లేని విద్యార్థులకు ప్రభుత్వం ఫీజులు చెల్లించి ఆదుకోవాలన్నారు.