టైమ్ చూసి మోడీకి విజయ్ ఝలక్..! కాక్రోచ్ టార్చర్ వేళ తెరపైకి కీలక డిమాండ్..!
నీట్ పరీక్ష (NEET UG 2026) లో చోటు చేసుకున్న లీకులపై కేంద్రం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. నీట్ పరీక్షను రద్దు చేసి, తాజాగా పరీక్ష నిర్వహించి ఫలితాలను కూడా ప్రకటించింది. అయినా లీకులతో నష్టపోయిన విద్యార్ధులు, వారి తల్లితండ్రులు కాక్రోచ్ పార్టీ ఢిల్లీలో చేపట్టిన ఉద్యమానికి మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో కేంద్రంపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో కేంద్రంపై ఒత్తిడి మరింత పెంచేలా తమిళనాడు సీఎం విజయ్ (Vijay)మరో కీలక డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.
జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేసేసి, వైద్య విద్య ప్రవేశాలను, విద్య విధానాన్ని పూర్తిగా రాష్ట్రాలకే అప్పగించాలని విజయ్ పార్టీ టీవీకే (TVK) ఇవాళ ఓ ప్రకటనలో డిమాండ్ చేసింది. తాము నీట్ పరీక్షలో అవకతవకలకు మాత్రమే వ్యతిరేకం కాదని, ఈ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలని కోరుకుంటున్నట్లు టీవీకే తెలిపింది. అలాగే వైద్య విద్యకు సంబంధించిన అంశాలపై రాష్ట్రాలకు కేంద్రం పూర్తి అధికారాలు ఇవ్వాలని కూడా టీవీకే డిమాండ్ చేసింది. ఢిల్లీలో నీట్పై విద్యార్థుల నిరసనల నేపథ్యంలో.. ఈ వ్యవహారంలో తమ వైఖరి రాజీలేనిదని, దృఢమైనదని టీవీకే పేర్కొంది.

విద్యను రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా నుంచి తీసేసి రాష్ట్ర జాబితాకు మార్చడమే దీనికి పరిష్కారమని టీవీకే తెలిపింది. అదే సమయంలో తమిళనాడులో విపక్ష డీఎంకేను కూడా టీవీకే టార్గెట్ చేసింది. మేమే నీట్ను రద్దు చేస్తామంటూ తప్పుడు హామీ ఇస్తూ ఓట్ల కోసం ప్రజలను మోసం చేసే మోసపూరిత రాజకీయాలకు తాము ఎప్పటికీ పాల్పడబోమని స్పష్టం చేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అధికారంలోకి వచ్చాక నీట్ను రద్దు చేస్తామని డీఎంకే చేసిన వాగ్దానాన్ని పరోక్షంగా ఇలా ప్రస్తావించింది. విద్యను వెంటనే రాష్ట్ర జాబితాలోకి తరలించడంలో చట్టపరమైన లేదా విధానపరమైన అడ్డంకులు ఉంటే, మధ్యేమార్గంగా ఒక ప్రత్యేక ఉమ్మడి జాబితాను ఏర్పాటు చేయాలని టీవీకే కేంద్రాన్ని కోరింది.












Click it and Unblock the Notifications