ఏపీలో బీసీ పాలిటిక్స్- జగన్ విజయవాడ సభ ప్లాన్-చంద్రబాబు కౌంటర్ వ్యూహం !
ఏపీలో బీసీ రాజకీయం మరోసారి వేడెక్కింది. గత ఎన్నికల్లో తమవైపు మొగ్గిన బీసీల్ని కాపాడుకునేందుకు వైసీపీ త్వరలో విజయవాడలో భారీ బహిరంగసభ నిర్వహిస్తోంది. దీంతో పాటు చంద్రబాబు బీసీల్ని మోసం చేశారంటూ వైసీపీ నేతలు విమర్శలకు దిగుతున్నారు. దీంతో వీరికి కౌంటర్ ఇచ్చేందుకు చంద్రబాబు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా టూర్ లో చంద్రబాబు బీసీల విషయంలో వైసీపీపై చేసిన విమర్శలతో రాజకీయం మరింత వేడెక్కుతోంది.
ఏపీలో బీసీ పాలిటిక్స్
ఏపీలో బీసీ రాజకీయాలు మరోసారి తెరపైకి వచ్చాయి. గత ఎన్నికల్లో బీసీల అండతో భారీ మెజారిటీ అందుకున్న వైసీపీ.. చాలా కాలం తర్వాత టీడీపీని వీడి తమవైపు మొగ్గిన వీరిని కాపాడుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మంత్రి పదవులతో పాటు నామినేటెడ్ పదవులు, ఎంపీలు, ఎమ్మెల్సీ పదవుల్లోనూ ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది. దీంతో ఇప్పటివరకూ అధికారానికి దూరంగా ఉన్న పలు కులాలకు న్యాయం చేసినట్లు వైసీపీ చెప్పుకుంటోంది. అదే సమయంలో వైసీపీ పాలనలో బీసీల కంటే రెడ్లకు ఎలా ప్రాధాన్యమిచ్చారన్న అంశాన్ని టీడీపీ తెరపైకి తెస్తోంది. దీంతో రాజకీయం వేడెక్కింది.
వైసీపీ బీసీ మహాసభ
బీసీలకు తమ ప్రభుత్వంలో ఇచ్చిన పదవులతో పాటు అమలు చేసిన రిజర్వేషన్లు, ఇతర మేలును గుర్తుచేసేందుకు విజయవాడలో ఈ నెల 7న వైసీపీ సర్కార్ జయహో బీసీ మహాసభను నిర్వహిస్తోంది. ఈ సభ ద్వారా బీసీలకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మేలును రాష్ట్రవ్యాప్తంగా తీసుకెళ్లాలనే యోచనలో కనిపిస్తోంది. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ పాలనలో పదవులు పొందిన బీసీలందరికీ ఆహ్వానాలు పంపుతోంది. దీంతో వైసీపీ బీసీ సభ రాజకీయంగా మరోసారి కులాల చర్చను తెరపైకి తెస్తోంది. అదే సమయంలో చంద్రబాబు పాలనతో జగన్ పాలనను పోలుస్తూ బీసీలకు జరిగిన మేలును వైసీపీ నేతలు గుర్తుచేస్తున్నారు. తద్వారా చంద్రబాబు చేయలేనిది తాము చేశామంటున్నారు.
రెడ్లతో కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు
దీంతో విపక్ష నేత చంద్రబాబు కూడా కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టేశారు. రాష్ట్రంలో మూడున్నరేళ్ల వైసీపీ పాలనలో రెడ్లకు కీలక పదవులు కట్టబెట్టి బీసీలకు నామమాత్రపు పదవులివ్వడాన్ని చంద్రబాబు ఫోకస్ చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీలకు పదుల సంఖ్యలో కార్పోరేషన్లు ఏర్పాటు చేసినా అధికారం కానీ, నిధులు కానీ ఇవ్వని విషయాన్ని గుర్తుచేస్తున్నారు. అలాగే టీడీపీ ప్రభుత్వంలో తాము పదవులిచ్చిన బీసీల్ని తీసి తమ సామాజికవర్గమైన రెడ్లకు వైసీపీ ప్రభుత్వ పెద్దలు అగ్రతాంబూలం ఇవ్వడాన్ని చంద్రబాబు హైలెట్ చేస్తున్నారు. తద్వారా బీసీల కంటే రెడ్లకే ఈ ప్రభుత్వంలో ఎక్కువగా మేలు జరిగిందన్న విషయాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.