నిన్న చిరంజీవి, నేడు బాలకృష్ణ టార్గెట్: పవన్ మూడు సభల వెనుక 'భారీ' ప్లాన్!
అనంతపురం: చిత్తూరు, కాకినాడలలో ప్రత్యేక హోదా సభలు నిర్వహించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 10వ తేదీన అనంతపురంలో నిర్వహిస్తున్నారు. మొదటి రెండు సభలకు కారణం ఉంది. అలాగే మూడో సభకు కూడా కారణం ఉందని అంటున్నారు.
అలాగే, దాని వెనుక మరో కోణం కూడా దాగి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ తన తొలి సభను తిరుపతిలో నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా పైన హామీ ఇచ్చిన ప్రాంతం. కాబట్టి అక్కడ సభ నిర్వహించినట్లు పవన్ తెలిపారు.
ఆ తర్వాత, కాకినాడలో సభ నిర్వహించారు. 1997లో బీజేపీ ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానం చేసింది ఇక్కడే. కాబట్టి కాకినాడలో రెండో సభను నిర్వహించినట్లు చెప్పారు. మూడో సభను అనంతపురంలో నిర్వహిస్తున్నారు. వెనుకబాటు, హోదా సమయంలో తీవ్రంగా ఉద్యమించింది అనంత.
ఇక్కడ సభ నిర్వహించడానికి పలు కారణాలు ఉన్నాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అనంత జిల్లా వెనుకబడిన జిల్లా. హోదా వస్తే ఇలాంటి జిల్లాలు అభివృద్ధి చెందుతాయని అనంత నుంచి గట్టిగా చెప్పేందుకే ఈ సభను ఇక్కడ నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.
అదే సమయంలో, టిడిపి నేత, హీరో నందమూరి బాలకృష్ణ పోటీ చేసి, గెలిచిన జిల్లా కాబట్టి అది కూడా ఓ కారణం కావొచ్చనే రూమర్లు వినిపిస్తున్నాయి.
మూడు సభల్లో రాజకీయ వ్యూహం కూడా దాగి ఉందని అంటున్నారు. పవన్కు కోస్తా, ఉత్తరాంధ్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని, రాయలసీమలో చిరంజీవికి ఉన్నంత ఫాలోయింగ్ లేదని చెబుతున్నారు. రాజకీయాల్లో రాణించాలంటే అభిమానులతో పాటు అనుచరులు కావాలి. తిరుపతి సభ ద్వారా సీమలోను పునాది వేసుకోవాలని పవన్ భావించారని అంటున్నారు.
ఇక, కాకినాడ సభ ద్వారా కుల సమకరణకు పవన్ కళ్యాణ్ తెరలేపినట్లుగా పలువురు భావిస్తున్నారు. ఇటీవలే ఏలూరులో ఓటును నమోదు చేయించుకుంటానని చెప్పడం ద్వారా తాను మీ వాడిని అని సొంత జిల్లా ప్రజలకు చెప్పే ఉద్దేశ్యం కనిపిస్తోందని అంటున్నారు. అనంతలో సభ ద్వారా బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న సొంత జిల్లాలో పవన్ ఆదరణను పెంచుకోవాలని భావిస్తున్నారని అంటున్నారు.