ఏం జరుగుతోంది: ఏపీలో అధికారంపై రాహుల్ గాంధీ 'కీలక' వ్యాఖ్యల వెనుక?
హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమదే అధికారమని, ఏపీలో మాత్రం ఇప్పట్లో అధికారంలోకి రావడం సాధ్యం కాదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల వెనుక ఏం ఉందనే చర్చ సాగుతోంది.
Recommended Video
మరోవైపు రాహుల్ గాంధీ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ భేటీకి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి హాజరయ్యారు. గత కొద్దికాలంగా ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడెనిమిది నెలల సమయం ఉంది.
తెలంగాణలో కాంగ్రెస్ - టీడీపీ పొత్తు?
ఇలాంటి సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై జోరుగా చర్చ సాగుతోంది. తెలంగాణలో తెరాసతో వెళ్లేందుకు కొందరు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీ పొత్తుపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. ఇటీవల కాంగ్రెస్, టీడీపీల దోస్తీ చూస్తుంటే ఆ చర్చకు బలం చేకురుస్తున్నాయి. మరోవైపు కేసీఆర్ కూడా ఒంటరిగా పోటీ చేస్తామని తేల్చి చెప్పారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ - టిడిపి పొత్తుకు మార్గం సుగమం అయిందని అంటున్నారు.
ఏపీలో అవగాహనతో టీడీపీ - కాంగ్రెస్
కుమారస్వామి ప్రమాణ స్వీకారం సమయంలో చంద్రబాబు, రాహుల్ గాంధీలు ఒక వేదికను పంచుకోవడం, ఒకరిని మరొకరు పరామర్శించుకోవడం, టీడీపీ అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వడం, అంతకుముందు సోనియా గాంధీతో టీడీపీ నేతలు కలవడం, బీజేపీ కంటే కాంగ్రెస్ చేసిన మోసం తక్కువ అనే అభిప్రాయంతో చంద్రబాబు మాట్లాడటం.. వంటి పరిణామాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ - కాంగ్రెస్ పొత్తుగా వెళ్లడంతో పాటు ఏపీలో అవగాహనతో వెళ్లే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలు
ఇప్పుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఆ రెండు పార్టీలు అవగాహనకు మరింత ఊతమిస్తున్నాయి. ఏ పార్టీ అయినా తాము అధికారంలోకి వస్తామని చెబుతారు. అదీ ఏపీని దశాబ్దాల పాటు పాలించిన కాంగ్రెస్ పార్టీ అధినేత ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం గమనార్హం. బలం పుంజుకుంటుందని చెప్పడం వరకు ఓకే. కానీ ఏపీలో తాము ఇప్పట్లో అధికారంలోకి రావడం కుదరదని చెప్పడం సంచలనమే అని చెప్పవచ్చు. తద్వారా టీడీపీతో అవగాహనపై ఏమైనా చర్చలు జరుగుతున్నాయా? అలా అయితేనే ఇలాంటి అభిప్రాయాలు చెబుతున్నారేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విభజన అనంతరం ఏపీలో పార్టీ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. ఇప్పుడు టీడీపీతో అవగాహన కుదుర్చుకుంటే ఎన్నోకొన్ని సీట్లు గెలుచుకునేందుకు అనుగుణంగా పోటీలో నిలబడాల్సి ఉంటుంది. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే చర్చ సాగుతోంది.
రాహుల్ గాంధీ ఏమన్నారంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో తాము కట్టుబడి ఉన్నామని రాహుల్ గాంధీ చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పొత్తులను స్థానిక పీసీసీలే నిర్ణయిస్తాయని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీదే విజయమని, ఏపీలో పరిస్థితి మెరుగుపడుతోందన్నారు. ఏపీలో ఇప్పట్లో అధికారంలోకి రావడం సాధ్యం కాదన్నారు.