విజయసాయి భార్య నామినేషన్ వెనుక...!, జగన్! ఇక్కడే చెప్పుతో కొట్టిస్తా: జేసీ
అనంతపురం/విజయవాడ: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ సందర్భంగా వైసిపి అభ్యర్థి విజయ సాయి రెడ్డి మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేయడంతో పాటు, చివరి రోజు తన భార్య సునందా రెడ్డితో నామినేషన్ దాఖలు చేయించారు. ఇందుకు ఓ కారణం ఉందని అంటున్నారు.
భార్యతో నామినేషన్ వేయించడం వెనుక ఆసక్తికరమైన కారణముందని అంటున్నారు. వైసిపి అధినేత జగన్ ఆస్తుల కేసులో జగన్తో పాటు విజయ సాయి రెడ్డి పైన పలు కేసులు నమోదయ్యాయి. వీటిని విజయ సాయి తన అఫిడవిట్లోను పేర్కొన్నారు.
కేసులన్నింటిలో విజయ సాయి రెడ్డి రెండో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులన్నీ ఇంకా కోర్టుల్లో వివిధ దశల్లో ఉన్నాయి. ఏ ఒక్క కేసులోనూ తుది తీర్పు వెలువడలేదు. అంటే ఒకవేళ తప్పు జరిగినా విజయ సాయి తుది తీర్పు వెలువడే దాకా నిందితుడిగానే లెక్క. దోషి మాత్రం కాదు.
అసలే తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనకు ఈ కేసులు ఎక్కడ ఇబ్బందిపెడతాయోనన్న అభిప్రాయంతో విజయ సాయి తన భార్యతో డమ్మీ నామినేషన్ వేయించారని అంటున్నారు. అయితే సాయిరెడ్డి నామినేషన్కు రిటర్నింగ్ అధికారి ఓకే చెప్పడం, నాలుగు సీట్లకు బరిలో నలుగురు మాత్రమే నిలిచిన నేపథ్యంలో సునందా రెడ్డి తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు.
జగన్ పైన జేసీ నిప్పులు
చంద్రబాబును విమర్శిస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి గురువారం రాత్రి వైసిపి అధినేత జగన్ను హెచ్చరించారు. తన నియోజకవర్గ పరిధిలో చంద్రబాబుపై జగన్ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో జేసీ మీడియా ముందుకు వచ్చారు.
నేను అనుకుంటే ఈ క్షణమే నిన్ను చెప్పులతో కొట్టించి తాడిపత్రి నుంచి తరిమివేయగలనని, తాడిపత్రిలో రైతు భరోసా యాత్ర పేరిట పర్యటిస్తున్న నిన్ను పది నిమిషాల్లోనే ప్రజల చేత చెప్పులతో కొట్టిస్తే ఏం చేస్తావని, ముఖ్యమంత్రిని కాదు ప్రజలు నిన్ను చెప్పులతో కొట్టి ఊరేగించే కాలం ఆసన్నమైందని ధ్వజమెత్తారు.