కరోనాపై యుద్ధం : కమిట్మెంట్ అంటే ఇదీ.. నిరూపిస్తున్న ఏపీ అధికారులు..
కరోనా వైరస్ పోరులో డాక్టర్లు,నర్సులు,పారిశుద్ధ్య కార్మికులే కాదు.. కొంతమంది అధికారులు సైతం నిస్వార్థ సేవలందిస్తున్నారు. సంతోషాలకు,విషాదాలకూ అతీతంగా విధులకే పరిమితమవుతూ తమ కర్తవ్యాన్ని చాటుకుంటున్నారు. ఓ పోలీస్ తన కన్నతల్లి చనిపోయినా దు:ఖాన్ని దిగమింగుకుని విధులు నిర్వర్తించడం.. ఓ అధికారిణి చంటిబిడ్డను వదిలేసి విధుల్లో చేరడం... తాజాగా ఓ కలెక్టర్ తన సొంత మామను పోగొట్టుకున్న విషాదంలోనూ విధులు నిర్వర్తించడం.. ఇవన్నీ అధికార యంత్రాంగం నిబద్దతను చాటి చెబుతున్నాయి. యాధృచ్చికంగా ఈ ముగ్గురు అధికారులు ఆంధ్రప్రదేశ్కి చెందినవారే కావడం గమనార్హం.

మామ చనిపోయిన విషాదంలోనూ.. విధుల్లో కలెక్టర్..
కృష్ణా జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ సతీమణి తండ్రి డా.ఇస్మాయిల్ హుస్సేన్ గుండె సంబంధిత వ్యాధితో మంగళవారం(ఏప్రిల్ 14)న కర్నూలులో కన్నుమూశారు. మామ మరణ వార్త విని కలత చెందిన కలెక్టర్.. విషాదంలోనూ విధులకే ప్రాధాన్యం ఇవ్వాలనుకున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మామ అంత్యక్రియలకు వెళ్లకుండా విధుల్లోనే కొనసాగి తన నిబద్దతను చాటుకున్నారు. మంగళవారం కరోనా కేసులపై తన కార్యాలయంలో సమీక్ష సమావేశాలతో ఆయన బిజీ బిజీగా గడిపారు.

కన్నతల్లి పోగొట్టుకున్న దు:ఖంలోనూ విధుల్లో శాంతారాం..
ఇటీవల విజయవాడ ఎస్ఐ శాంతారామ్ సైతం ఇలాగే తన నిబద్దతను చాటుకున్నారు. మాతృమూర్తి చనిపోయిన విషాదంలోనూ విధులకు హాజరై కర్తవ్యాన్ని నిర్వర్తించారు. వీడియో కాల్ ద్వారా తల్లి అంత్యక్రియలను వీక్షించి కన్నీరుమున్నీరయ్యారు. తాను విధులకు హాజరవడమే తన తల్లికి ఇచ్చే నివాళి అని.. తద్వారా ఆమె ఆత్మ శాంతిస్తుందని కోరుకుంటున్నట్టు తెలిపారు. శాంతారామ్ తల్లి అనారోగ్యంతో విజయనగరంలో కన్నుమూశారు. ఆయన అక్కడికి వెళ్లాలంటే 4 జిల్లాలు,40 చెక్ పోస్టులు దాటుకుని వెళ్లాలి. ఓవైపు కరోనా విధులు.. మరోవైపు లాక్ డౌన్ నిబంధనలు.. కుటుంబ సభ్యులంతా కలిసి అంత్యక్రియలకు బయలుదేరితే కరోనా వ్యాప్తికి ఆస్కారం కల్పించినట్టవుతుందన్న ఉద్దేశంతో ఆయన ఆ ఆలోచనను విరమించుకున్నారు. తన సోదరుడిని మాత్రమే పంపించి అతికొద్దిమందితో అంత్యక్రియలు నిర్వహించారు.

నవజాత శిశువుతో విధుల్లో ఐపీఎస్ అధికారిణి
విశాఖపట్నం నగర మున్సిపల్ కమిషనర్ గుమ్మళ్ల సృజన కూడా తన కమిట్మెంట్ను చాటుకున్నారు. ప్రసూతి సెలవులకు అవకాశం ఉన్నా.. నవజాత శిశువును పొత్తిళ్లల్లో పెట్టుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రసూతీ ముందూ తర్వాతా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ఆరోగ్యం గురించి,బిడ్డ బాగోగుల గురించి ప్రత్యేకంగా తెలుసుకుని.. వృత్తిరీత్యా తనకు కొన్ని వెసులుబాట్లు కల్పించినట్టు చెప్పారు. ఇప్పుడు గనుక తాను ప్రసూతీ సెలవుల్లో వెళ్తే.. కొత్తగా వచ్చే అధికారికి ఇక్కడి పరిస్థితులు అర్థం కావడం,అధికారులు,సిబ్బందితో సమన్వయానికి సమయం పడుతుందన్నారు. అప్రమత్తంగా వ్యవహరించాల్సిన సమయంలో ఇలాంటి పరిస్థితి మంచిది కాదని.. తానే ప్రసూతి సెలవులను వదులుకుని విధుల్లో చేరినట్టు చెబుతున్నారు. ఏపీలో ఇలా నిస్వార్థంగా సేవలందిస్తున్న అధికారులను చూసి.. సరిలేరు మీకెవ్వరు అని ప్రజలు ప్రశంసిస్తున్నారు. అధికార యంత్రాంగం బాధ్యాతయుతమైన కమిట్మెంట్ చాలామందిని ఆలోచింపజేస్తోంది.












Click it and Unblock the Notifications