కేసీఆర్ బెదిరిస్తున్నారు: భట్టి, జగన్కి సీనియర్ల ఫోబియా
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం కూలడానికి సిద్ధంగా ఉందని, అందుకే ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భట్టి విక్రమార్క గురువారం విమర్శించారు. ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను బెదిరించి చేర్చుకుంటున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేల్లో త్వరలో చీలిక రాబోతుందని జోకస్యం చెప్పారు. ఇతర పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా చేర్చుకుంటారని ఆయన కేసీఆర్ను ప్రశ్నించారు. ప్రజా సమస్యలు బయటపడకుండా ఉండేందుకు కేసీఆర్ గందరగోళ వ్యాఖ్యలతో అయోమయం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఛత్తీస్గఢ్కు కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నవంబర్ 2వ తేదీన ఛత్తీస్గఢ్ వెళ్తున్నారు. విద్యుత్ కోసం ఎంవోయు కుదుర్చుకోనున్నారు.
సమయపాలన పాటించాలి: కేటీఆర్
ఉద్యోగులు సమయపాలన పాటించాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వేరుగా అన్నారు. ఉదయం పదకొండు గంటల సమయానికి కూడా 21 మంది సెక్షన్ ఆఫీసర్లలో కేవలం నలుగురే వచ్చారన్నారు. తమ ప్రభుత్వం ఎంప్లాయ్ ఫ్రెండ్లీ అయినప్పటికీ.. క్రమశిక్షణ ముఖ్యమన్నారు. అది లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఇక పైన కూడా తనిఖీలు ఉంటాయన్నారు.
జగన్ పైన నిప్పులు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కొణతాల రామకృష్ణ వర్గం మండిపడుతోంది. సీనియర్ నేతలంటే జగన్ భయపడుతున్నారని, అందుకే వారిని పార్టీకి దూరం చేస్తున్నారని గండి బాబ్జి ఆరోపించిన విషయం తెలిసిందే. జగన్కు సీనియర్ల ఫోబియా పట్టుకుందన్నారు. తన కుర్చీ లాక్కుంటారనే ఆందోళన జగన్లో ఉందని ఎద్దేవా చేశారు.
జూన్ 2 సరికాదు: ధర్మాన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జూన్ 2వ తేదీ జరపడం సరికాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళంలో అన్నారు. ఉత్తరాంధ్రలో సహాయక చర్యలు ఎక్కడికి అక్కడ ఆగిపోయాయని విమర్శించారు. రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు.