బిచ్చగాడిగా.., రాజారెడ్డిని చంపించింది చంద్రబాబే: భూమన సంచలనం
ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన పాలన పైన తనకే నమ్మకం లేదని, అలాగే ఏ ఒక్కరికి కూడా విశ్వాసం లేదని, పొగడ్తలను అడుక్కునే బిక్షగాడిగా కనిపిస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు.
చిత్తూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తన పాలన పైన తనకే నమ్మకం లేదని, అలాగే ఏ ఒక్కరికి కూడా విశ్వాసం లేదని, పొగడ్తలను అడుక్కునే బిక్షగాడిగా కనిపిస్తున్నారని వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి గురువారం మండిపడ్డారు.
చంద్రబాబు ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల పనులను 90 శాతం పూర్తి చేశారని, వాటిని చంద్రబాబు ప్రారంభించి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
పొగడ్తలు అడుక్కునే బిచ్చగాడిగా చంద్రబాబు దిగజారిపోయారన్నారు. తన పాలన పైన నమ్మకం లేక ప్రజలతో ప్రమాణాలు చేయించుకుంటున్నారన్నారు. సంక్షేమం, ప్రజాసేవ తప్ప ప్రచారం కోసం చంద్రబాబులా వైయస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు పాకులాడలేదన్నారు.
'ఇదీ వైసీపీ అధినేత జగన్ ఆలోచన, ప్రజల గురించి మాత్రం కాదు'
వైయస్ పాలన ఓ సువర్ణయుగం అన్నారు. ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాయన్నారు. అందుకే మహానేతను ఇప్పటికీ జనం గుండెల్లో పెట్టుకున్నారన్నారు.
కుల, హత్యా రాజకీయాలు చేస్తోంది చంద్రబాబేనని, వైయస్ రాజారెడ్డిని చంపించింది కూడా చంద్రబాబే అని సంచలన ఆరోపణలు చేశారు. జగన్ను భౌతికంగా అంతమొందించే కుట్ర జరుగుతోందన్నారు. సోనియాతో కలిసి తప్పుడు కేసులు పెట్టారన్నారు. ఇప్పుడు వారు హత్యా రాజకీయాల గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. నాడు వైయస్ రాజశేఖర రెడ్డి పైన అబద్దాలు చెప్పినట్లుగానే ఇప్పుడు వైయస్ జగన్ పైన అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు.