లక్ష్యం పూర్తయినందుకే రాజీనామా: సిఎంపై భూమన
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు పూర్తిగా సహకరించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, తన లక్ష్యం నెరవేరుతుండటంతో ఇప్పుడు రాజీనామా చేస్తానని డ్రామాలాడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన పట్ల సిఎం కిరణ్ అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పదవిని అడ్డం పెట్టుకుని వందల కోట్లు సంపాదించాలన్న లక్ష్యం ఇప్పటికీ పూర్తయిందా అంటూ సిఎం కిరణ్ కుమార్ రెడ్డిపై భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన లక్ష్యం పూర్తయింది కాబట్టే ఇప్పుడు సిఎం పదవికి రాజీనామా చేస్తానని కిరణ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న వెంటనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసివుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. అప్పుడు రాజీనామా చేయని సిఎం కిరణ్ ఇప్పుడు ఎందుకు రాజీనామా చేస్తున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామాలు చేసి రాజ్యాంగ సంక్షోభం సృష్టిద్దామని తమ పార్టీ గతంలోనే పిలుపునిచ్చిందని భూమన తెలిపారు. ఆనాడు స్పందించని సిఎం కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయడమేందుకని ప్రశ్నించారు.