మాకు లాభమేంటి? మీ వల్ల ఏపీకి ఇన్ని అపవాదులు: బాబుపై పవన్
అమరావతి: ఏపీ ప్రజలు బీజేపీని పూర్తిగా వదిలేశారని, అలాంటి పార్టీతో రాష్ట్రంలో ఎవరైనా పొత్తు పెట్టుకుంటారా అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో ఒక్క సీటూ కూడా గెలవలేని బీజేపీని ఎవరైనా వెనుకేసుకొస్తారా అని ప్రశ్నించారు. బీజేపీని వెనుకేసుకొస్తే మాకొచ్చే లాభం ఏమిటో చెప్పాలన్నారు.
బీజేపీతో సమానంగా టీడీపీ అంతే దారుణంగా ఏపీ ప్రయోజనాలను దెబ్బతీసిందని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు శుక్రవారం రాత్రి విలేకరులతో మాట్లాడుతూ బీజేపీకి నష్టం కలగకూడదనే జనసేన ట్వీట్లు చేసిందని విమర్శించారని, దానికి సమాధానం ఇదని పవన్ అన్నారు. మీ సుదీర్ఘ అనుభవం, పరిపాలన దక్షత ఏపీని కాపాడలేకపోతున్నాయని, 4 సంవత్సరాలుగా హోదా విషయంలో మీరు, పార్టీ ఎన్ని రకాలుగా మాట మార్చారో మీకు తెలియందని కాదన్నారు.

మీరు (చంద్రబాబు) ఇలా చేయడం వల్ల ఏపీ ప్రజలను దేశస్థాయిలో నిలకడలేనివాళ్లుగా, అవకాశవాదులుగా, ఆత్మగౌరవం లేని వాళ్లుగా నిలబెట్టారని పవన్ ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీకి టీడీపీ ఎంపీలు పాదాభివందనం చేస్తారని, అదే సభలో బీజేపీని తిడతారన్నారు. దీనిని ఎలా అర్థం చేసుకోవాలన్నారు. 2017 మార్చి 17న హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీయే చాలా మంచిదన్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలను, శుక్రవారం లోకసభలో హోదాయే తనకు సర్వస్వం అన్న వ్యాఖ్యలను పోలుస్తూ ట్వీట్ చేశారు.
ప్రత్యేక హోదాను ఎవరు నీరుగార్చారని పవన్ ప్రశ్నించారు. ఒక్కసారి వెనక్కు చూసుకుని మాట్లాడాలని చంద్రబాబుకు హితవు పలికారు. రేపు మళ్లీ మీ వైఖరిని మార్చుకోబోమని గ్యారంటీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. ఏపీలో బీజేపీకి ఒక్క సీటు రాదన్నారు. టీడీపీ నేతలకు గజిని సినిమా హీరోలాగా జ్జాపకశక్తి నశించిందమో అన్నారు.












Click it and Unblock the Notifications