కుప్పంలో చంద్రబాబుకు మరో ఊరట-హైకోర్టు మరో కీలక ఆదేశం- వైసీపీకి ఎదురుదెబ్బ
ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్ధానిక సంస్ధల ఎన్నికలన్నీ ఓ ఎత్తు, కుప్పం మున్సిపాలిటీ పోరు ఓ ఎత్తు అన్నట్లుగా పరిస్ధితి మారిపోతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబును తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఓడించడం ద్వారా పైచేయి సాధించాలని అధికార వైసీపీ ఉవ్విళ్లూరుతోంది. ఇదే క్రమంలో అధికార పార్టీ నిర్ణయాలకు తలూపుతున్న పోలీసులు... తాజాగా టీడీపీ ప్రచారంపై ఆంక్షలు విధించారు. వీటిని హైకోర్టు కొట్టేసింది. అంతే కాదు పోలీసుల తీరుపై కీలక వ్యాఖ్యలు కూడా చేసింది.

కుప్పంలో వైసీపీ వర్సెస్ టీడీపీ
కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రతీ వార్డులోనూ ఇరుపార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోరాడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇదే క్రమంలో పరస్పరం పైచేయి సాధించేందుకు ఎత్తులు, పై ఎత్తులు వేసుకుంటున్నాయి. అయితే ఇప్పటికే కుప్పం పంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలిచిన వైసీపీ.. ఈసారి మున్సిపల్ పోరులోనూ గెలిచి చంద్రబాబుకు సొంత నియోజకవర్గంలోనే బలం లేదని చాటేందుకు సామదానభేద దండోపాయాలు ప్రయోగిస్తోంది. ఇందుకు పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారు.

కుప్పంలో ప్రచారంపై పోలీసు ఆంక్షలు
కుప్పం మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారం చేయాలంటే ముందుగా తమ అనుమతి తీసుకోవాంటూ పలమనేరు డీఎస్సీ జారీ చేసిన ఆంక్షలు కలకలం రేపాయి. ప్రజాస్వామ్యంలో భాగమైన ఎన్నికల ప్రక్రియలో ప్రచారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వకపోవడమేంటన్న విమర్శలు వచ్చాయి. దీనిపై టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. కుప్పం మున్సిపాలిటీలో ప్రచారం కూడా చేసుకోనివ్వడం లేదంటూ ఆరోపించింది. దీంతో జోక్యం చేసుకున్న హైకోర్టు తీవ్రంగా స్పందించింది. దీంతో పోలీసుల తీరు మరోమారు చర్చనీయాంశమైంది.

డీఎస్పీ నోటీసుల కొట్టివేత
కుప్పం మున్సిపాలిటీ పరిధిలో నేతలు ప్రచారం చేయాలంటే ముందుగా తమ అనుమతి తీసుకోవాలంటూ పలమనేరు డీఎస్పీ జారీ చేసిన నోటీసులను హైకోర్టు కొట్టేసింది. డీఎస్పీ జారీ చేసిన నోటీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాదు ఈ వ్యవహారంపై పలమనేరు డీఎస్పీ వివరణ తీసుకుని హైకోర్టుకు సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. టీడీపీ నేతలు పులివర్తి నాని, అమర్నాథ్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, మునిరత్నం ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవద్దంటూ హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. దీంతో టీడీపీ నేతల ఎన్నికల ప్రచారానికి మార్గం సుగమమైంది.

పోలీసుల తీరుపై హైకోర్టు సీరియస్
కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారానికి తమ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకపోతే ఐపీసీ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పలమనేరు డీఎస్పీ జారీ చేసిన నోటీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల ప్రచారానికి ముందస్తు అనుమతులు తీసుకోమని రాష్ట్ర ఎన్నికల సంఘమే ఆంక్షలు విధించలేదని, అలాంటిది డీఎస్పీ ఏ నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించింది. అంతే కాదు ఇప్పుడు ప్రచారానికి ఆంక్షలు విధిస్తున్నారని, రేపు నామినేషన్లకు కూడా ఆంక్షలు విధిస్తారా అని నిలదీసింది. డీఎస్పీ నోటీసుల్ని చూస్తుంటే రాష్ట్రంలో పరిస్ధితులు ఎలా ఉన్నాయో అర్ధం అవుతున్నాయని కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది.
Recommended Video

చంద్రబాబుకు భారీ ఊరట
కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ నేతల ప్రచారానికి ముందస్తు అనుమతుల నిబంధన పెట్టి, వైసీపీ నేతల్ని మాత్రం యథావిధిగా అనుమతించిన పోలీసుల తీరుపై హైకోర్టు వ్యాఖ్యలు అధికార పార్టీకి ఎదురుదెబ్బగా మారాయి. కుప్పంలో టీడీపీ నేతల్ని ప్రచారం కూడా చేయనీయకుండా అడ్డుకోవాలన్న వైసీపీ ఎత్తులకు హైకోర్టు చెక్ చెప్పింది. అదే సమయంలో కుప్పంలో వరుసగా రెండోసారి హైకోర్టు ఆదేశాలు స్ధానిక ఎమ్మెల్యే కూడా అయిన చంద్రబాబుకు ఊరటనిచ్చాయి. తాజాగా ఎన్నికల కోసం కుప్పంలో ప్రత్యేకాధికారి నియామకంపై హైకోర్టు సీరియస్ అయింది. ఇప్పుడు ప్రచారంపైనా హైకోర్టు ఆదేశాలతో చంద్రబాబుకు మరో ఊరట దక్కినట్లయింది.












Click it and Unblock the Notifications