ఏపీలో కరెంటు వినియోగదారులకు ఊరట-ట్రూఅప్ ఛార్జీల నిలిపివేత-తాత్కాలికమేనా ?
ఏపీలో విద్యుత్ వినియోగదారులకు ట్రూఅప్ ఛార్జీల భారం నుంచి తాత్కాలిక ఊరట దక్కింది. గత నష్టాల్ని ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారులపై వేసి రెండు నెలలుగా వసూలు చేస్తున్న డిస్కంలు.. ఇప్పుడు తాజా బిల్లుల్లో మాత్రం వాటిని విధించలేదు. ఏపీఈఆర్సీ ఆదేశాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తాజాగా జారీ చేస్తున్న బిల్లుల్లో ట్రూఅప్ ఛార్జీలు కనిపించలేదు. ఇది రెండు నెలలుగా బిల్లుల మోతతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు ఊరట నిస్తోంది.
ట్రూఅప్ ఛార్జీల వ్యవహారం
ఏపీలో 2014-15 నుంచి 2018-19 ఆర్ధిక సంవత్సరాల వరకూ విద్యుత్ పంపిణీ సంస్ధలకు సరఫరా లోపాల వల్ల వాటిల్లిన నష్టాన్ని పూరించుకునేందుకు ట్రూఅప్ ఛార్జీల్ని వైసీపీ సర్కార్ తెరపైకి తెచ్చింది. ఇందుకోసం గతంలో వారు వాడిన యూనిట్లు కాకుండా 2021-22లో విద్యుత్ వాడకాల ఆధారంగా నిర్ణయించారు. అక్కడే సమస్య ఏర్పడింది. ఇలా విద్యుత్ సంస్ధలకు వాటిల్లిన నష్టాల భర్తీ పేరుతో ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీల్ని ఈ ఏడాది ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి నెల వరకూ ఎనిమిది నెలల పాటు జారీ చేసే కరెంటు బిల్లుల్లో విధించాలని డిస్కంలు నిర్ణయించాయి. దీంతో ఈ వ్యవహారం వివాదాస్పదంగా మారింది.
రెండు నెలలు బాదేశాక..
ఏపీలో డిస్కంలు నిర్ణయించిన ప్రకారం విద్యుత్ బిల్లుల్లో ట్రూఅప్ ఛార్జీల్ని ఈ ఏడాది ఆగస్టు నుంచి విధించడం మొదలుపెట్టారు. ఇలా వరుసగా రెండు నెలల పాటు అంటే ఆగస్టు బిల్లుల్ని సెప్టెంబర్ లో, సెప్టెంబర్ బిల్లుల్ని అక్టోబర్ లో ట్రూఅప్ ఛార్జీలతో కలిపి వసూలు చేశారు. దీంతో డిస్కంలు తమ నష్టాల్ని కొంత మేర భర్తీ చేసుకోగలిగాయి. ఆ మేరకు విద్యుత్ వినియోగదారుల జేబులకు చిల్లు కూడా పడింది. అప్పటికే వినియోగదారులతో పాటు విపక్షాల నుంచి కూడా విమర్శలు వస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాలతో వెనక్కి తగ్గింది. దీంతో ఏపీ ఈఆర్సీ ప్రస్తుతానికి ట్రూఅప్ ఛార్జీలు విధించవద్దని ఆదేశాలు జారీ చేసింది.
వసూలు చేసిన మొత్తం సర్దుబాటు
ఇప్పటివరకూ రెండు నెలలుగా ట్రూఅప్ సర్దుబాటు ఛార్జీల్ని డిస్కంలు విద్యుత్ వినియోగదారులకు పంపాయి. ఇప్పుడు హైకోర్టు, ఈఆర్సీ ఆదేశాల నేపథ్యంలో ఇలా వసూలు చేసిన ఛార్జీల్ని తిరిగి వినియోగదారులకు వెనక్కి ఇవ్వాల్సిన పరస్ధితి ఎదురవుతోంది. దీంతో రాబోయే బిల్లుల్లో ఈ మొత్తాన్ని సర్దుబాటు చేసి ఇస్తామని డిస్కంలు చెప్తున్నాయి. అయితే ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో ఎవరికీ తెలియదు. డిస్కంలు తమ ఆర్ధిక వెసులుబాటు చూసుకుని ఈ సర్దుబాట్లు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. అయితే డిస్కంల తాజా నిర్ణయంతో మాత్రం రాబోయే ఆరునెలల పాటు వినియోగదారులకు ట్రూఅప్ ఛార్జీల భారం తప్పినట్లేనని తెలుస్తోంది.
ఊరట తాత్కాలికమేనా ?
ఏపీలో విద్యుద్ పంపిణీ సంస్ధలు కరెంటు బిల్లుల్లో ట్రూఅప్ సర్దుబాట్ల పేరుతో అదనపు మొత్తాల్ని విధించడంతో వినియోగదారుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. అయితే హైకోర్టు జోక్యంతో ఈసారి సర్దుబాటు ఛార్జీల భారం తప్పింది. అయితే ఓవైపు డిస్కంలు నష్టాల బాటులో సాగుతుండటం, కేంద్ర ప్రభుత్వం వాటిని నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చే పరిస్ధితి వస్తుండటంతో వినియోగదారులకు ట్రూఅప్ ఛార్జీల భారం విధించక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో తాజాగా కేంద్ర విద్యుత్ ఆర్ధిక సంస్ధల అధికారులు వచ్చినప్పుడు ప్రభుత్వం వారికి ఎలాగైనా తమ అప్పు తీరుస్తామని చెప్పింది. దీంతో అసలే ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ట్రూఅప్ ఛార్జీలు విధించక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది.