జగన్ సర్కార్ కు బిగ్ షాక్-విద్యాదీవెన పిటిషన్ కొట్టేసిన హైకోర్టు-తల్లులకు లేనట్లే
ఏపీలో జగనన్న విద్యాదీవెన పథకం అమలు కోసం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆదేశాలు ఇచ్చారు. ఇందులో గతంలో కొనసాగిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ప్రకారం కాకుండా కాలేజీలకు బదులుగా నేరుగా తల్లుల ఖాతాల్లోనే పిల్లల ఫీజు మొత్తాల్ని వేయడం మొదలుపెట్టారు. దీంతో కొందరు తల్లులు వీటిని దుర్వినియోగం చేయడం కూడా మొదలైంది. దీంతో హైకోర్టు ఈ పథకాన్ని మారుస్తూ ఆదేశాలు ఇచ్చింది. వీటిపై ప్రభుత్వం సమీక్ష పిటిషన్ దాఖలు చేయగా.. దాన్ని కూడా ఇవాళ కొట్టేసింది.

జగనన్న విద్యాదీవెన
ఏపీలో గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభమైన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం స్దానంలో వైసీపీ ప్రభుత్వం జగనన్న విద్యా దీవెన పేరుతో కొత్త పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా గతంలో కాలేజీలకు ఇచ్చిన ఫీజు రీయింబర్స్ మెంట్ ను కాస్తా సవరించి తల్లుల ఖాతాల్లోకి ఇవ్వడం మొదలుపెట్టారు. దీనిపై ఆరంభంలోనే కాలేజీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రభుత్వం వాటిని లెక్క చేయలేదు. ఆ తర్వాత విద్యాదీవెన తీసుకున్న తల్లులు వాటిని సొంత అవసరాలకు వాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో అవి కాస్తా దుర్వినియోగం కావడం కూడా ప్రారంభమైంది.

కోర్టుకెక్కిన కాలేజీలు
జగనన్న విద్యాదీవెన పేరుతో ప్రభుత్వం విద్యార్ధుల కోసం తమకు చెల్లించాల్సిన ఫీజుల్ని నేరుగా తల్లుల ఖాతాల్లో వేయడం, వారిలో కొందరు దుర్వినియోగం చేస్తుండటంతో కాలేజీలు కోర్టుకెక్కాయి. తమకు ఇవ్వాల్సిన ఫీజులు ఎవరిస్తారని ప్రశ్నించాయి. దీంతో హైకోర్టు కూడా ఈ వ్యవహారాన్ని తప్పుబట్టింది. కాలేజీలకు వెళ్లాల్సిన ఫీజుల్ని తల్లులకు ఇవ్వడమేంటని ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం కూడా ఇరుకునపడింది. అయినా దీనిపై వెనక్కి తగ్గలేదు. తల్లులు మాత్రం కచ్చితంగా కాలేజీలకు ఫీజులు చెల్లించాలని సూచించింది.

తల్లుల ఖాతాల్లో కుదరదన్న హైకోర్టు
జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ఇస్తున్న ఫీజు రీయింబర్స్ మెంట్ ను తల్లుల ఖాతాల్లో వేయడం కుదరదని హైకోర్టు గతంలో తేల్చిచెప్పింది. దీంతో ప్రభుత్వం ఇకపై కాలేజీల ఖాతాల్లోనే ఈ మొత్తాలు వేస్తుందని అంతా భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం అలా చేయలేదు హైకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది మరోవైపు కాలేజీలకు ఠంచనుగా ఫీజులు చెల్లించాలని తల్లులకు సూచించింది. అలా చెల్లించని వారికి మరో విడత ఫీజులు ఇవ్వబోమని చెప్పింది. తాజాగా మూడో విడత విడుదల చేసిన ఫీజుల్ని సైతం తల్లుల ఖాతాల్లోనే వేసింది.

జగన్ సర్కార్ కు భారీ షాక్
జగనన్న విద్యాదీవెన పథకంలో భాగంగా ప్రభుత్వం ఇస్తున్న ఫీజుల్ని తల్లులు ఠంచనుగా కాలేజీలకు జమ చేస్తున్నారు కాబట్టి గతంలో ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలని వైసీపీ సర్కార్ హైకోర్టును కోరింది. అయితే హైకోర్టు మాత్రం ఇందుకు ఒప్పుకోలేదు. కాలేజీల అభిప్రాయం ప్రకారం చూస్తే ఈ ఫీజు మొత్తాలు తల్లుల ఖాతాల్లో వేస్తే తమకు చేరడం లేదనే వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. దీంతో ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ ను తోసిపుచ్చింది. తల్లుల ఖాతాల్లో నగదు జమచేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వుల్ని హైకోర్టు కొట్టేసింది.












Click it and Unblock the Notifications