పోలవరంపై జగన్ కు కేంద్రం బిగ్ షాక్-కొత్త డీపీఆర్ పై యూటర్న్- కథ మళ్లీ మొదటికి
ఏపీ విభజన చట్టంలో భాగంగా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరానికి నిదులు ఇచ్చే విషయంలో ఇన్నాళ్లుగా మీనమేషాలు ప్రదర్శిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. ఇవాళ మరో భారీ షాకిచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించినట్లు వైసీపీ సొంత రాష్ట్రంలో ప్రచారం చేసుకుని పారం రోజులు కూడా కాకముందే అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద పెండింగ్ లో లేదని పార్లమెంటులో అధికారికంగానే తేల్చిచెప్పేసింది. దీంతో పోలవరం కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది..

పోలవరానికి మరో షాక్
జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం గుర్తింపు పొందినప్పటికీ నిధుల కొరతతో అల్లాడుతున్న పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇవాళ మరో భారీ షాకిచ్చింది. పోలవరం ప్రాజెక్టుకు తగినన్ని నిధులు ఇచ్చి ప్రోత్సహించే విషయంలో మీన మేషాలు లెక్కించి ఆలస్యానికి కారణమైన కేంద్రం.. ఆ తర్వాత సవరించిన అంచనాల ప్రకారం నిధులు ఇస్తామని మధ్యలో హామీ ఇచ్చింది. అయితే దానిపై ఆ తర్వాత మళ్లీ నోరు మెదపలేదు. కానీ ఇవాళ తాజాగా మరోసారి అలాంటి ప్రతిపాదనేదీ తమ వద్ద పెండింగ్ లో లేదని పార్లమెంటులో తేల్చి చెప్పడం ద్వారా భారీ షాకిచ్చింది.

విజయసాయిరెడ్డి ప్రశ్నకు జవాబుగా
పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం షాకింగ్ సమాధానం ఇచ్చింది. సవరించిన అంచనాల ప్రకారం రూ.54 వేల కోట్ల మేర ఉన్న కొత్త డీపీఆర్ ను ఆమోదించాలని తాజాగా వైసీపీ ఎంపీలు కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ ను కలిసి కోరారు. ఇదే విషయాన్ని ఇవాళ మరోసారి రాజ్యసభలో ప్రస్తావించిన విజయసాయిరెడ్డికి అదే మంత్రి షెకావత్ షాకింగ్ సమాధానం ఇచ్చారు. దీంతో వైసీపీకి దిమ్మతిరిగినట్లయింది.

కొత్త డీపీఆర్ పై కేంద్రం యూటర్న్
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే నిధుల కోసం తాజాగా సవరించిన అంచనాల ప్రకారం తాము ఇచ్చిన డీపీఆర్ ఆమోదించాలని వైసీపీ ఎంపీలు కోరుతుండగా.. ఇవాళ జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ అసలు తమకు ఎలాంటి డీపీఆర్ అందలేదని స్పష్టం చేశారు. తమ వద్ద పోలవరంపై ఎలాంటి కొత్త డీపీఆర్ పెండింగ్ లో లేదని షెకావత్ తేల్చిచెప్పడంతో వైసీపీ ఎంపీలకు నోటి మాట కరువైంది. ఇప్పటివరకూ కొత్త డీపీఆర్ కు కేంద్రం ఆమోదం లభిస్తుందని ధీమాగా ఉన్న వైసీపీ ఎంపీలు.. ఇవాళ షెకావత్ యూటర్న్ తో షాకయ్యారు.

వైసీపీ ఎంపీలు ఎందుకలా చెప్పారు ?
ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు సవరించిన డీపీఆర్ కు సంబంధించి ఢిల్లీలో లాబియింగ్ చేస్తున్నట్లు, కేంద్రమంత్రుల్ని కలుస్తున్నట్లు వైసీపీ ఎంపీలు చెప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో వైసీపీ ఎంపీలు చెప్పినట్లుగా తమ వద్ద ఎలాంటి డీపీఆర్ పెండింగ్ లో లేదని కేంద్రం తేల్చిచెప్పడంతో ఆ పార్టీ ఇరుకునపడుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక తమకు ఎలాంటి కొత్త డీపీఆర్ అందలేదని కేంద్రం చేసిన ప్రకటన ఇప్పుడు వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగిత్తించేలా ఉంది. గతంలో 2011-19లోనే పెరిగిన ధరల ప్రకారం కొత్త డీపీఆర్ ను ఆమోదించినట్లు కేంద్రం చేసిన ప్రకటన చూస్తుంటే వైసీపీ ఎంపీలు ఎందుకలా చెప్పారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.

మళ్లీ మొదటికొచ్చిన పోలవరం
గతంలో కేంద్రం ఆమోదించిన డీపీఆర్ ను మారిన పరిస్ధితులకు అనుగుణంగా సవరించాలని కేంద్రాన్ని వైసీపీ కోరుతూ వచ్చింది. గతంలో పలుమార్లు కేంద్రంలో ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్ షాను, జల్ శక్తి మంత్రి షెకావత్ ను కలిసిన సీఎం జగన్ సైతం పోలవరం కొత్త డీపీఆర్ ను ఆమోదించాలని కోరారు. కానీ కేంద్రం మాత్రం ఇవాళ తాజా అంచనాలేవీ తమ వద్ద పెండింగ్ లో లేవని చెప్పేయడంతో గతంలో ఆమోదించిన మేరకు వచ్చే నిధులే అందే అవకాశముంది. వీటితో పోలవరం పూర్తి చేయడం అసాధ్యం. దీంతో పోలవరం కథ మళ్లీ మొదటికొచ్చినట్లయింది.












Click it and Unblock the Notifications