జగన్ బటన్ నొక్కుడు-బీజేపీ, జనసేన ఫ్రస్ట్రేషన్-జనం కూడా బటన్ క్లిక్ కోసమే వెయిటింగ్..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందున్న ప్రభుత్వాల తరహాలో కాకుండా సంక్షేమ పథకాల్ని నేరుగా జనం ఖాతాల్లోకి పంపడం మొదలుపెట్టింది. దీంతో అవినీతి, అక్రమాలు తగ్గిపోయాయని కూడా చెబుతోంది. సీఎం జగన్ నేరుగా బటన్ నొక్కి జనం ఖాతాల్లో సంక్షేమ పథకాల డబ్బులు వేస్తున్నారు. దీంతో విపక్షాలు, అప్పడవ్పుడూ సొంత పార్టీ నేతలు సైతం ఈ బటన్ క్లిక్స్ పై సెటైర్లు వేస్తూనే ఉన్నారు.
వైఎస్ జగన్ బటన్ క్లిక్స్
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక భారీ ఎత్తున సంక్షేమ పథకాల్ని అమలు చేస్తోంది. ఇందుకోసం భారీ ఎత్తున నిధులు ఖర్చుపెడుతోంది. అవి సరిపోక భారీగా అప్పులు కూడా చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలంటే ఈ నిధులతో సంక్షేమ పథకాలు లబ్దిదారుల ఖాతాల్లోకి సక్రమంగా వెళ్లాలనేది జగన్ ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో సీఎం జగన్ దళారులకు, తమ పార్టీ నేతలకు కూడా సంబంధం లేకుండానే నేరుగా బటన్ నొక్కి డబ్బుల్ని లబ్దిదారుల ఖాతాల్లో వేస్తున్నారు. దీంతో సొంత పార్టీ నేతలతో పాటు విపక్షాలు కూడా దీనిపై అసూయగా ఉన్నట్లు తెలుస్తోంది.
జగన్ బటన్ క్లిక్స్ పై జనసేన
రాష్ట్రంలో ప్రతీ సంక్షేమ పథకానికీ జగన్ బటన్ క్లిక్స్ చేస్తున్నారని, ఆయితే బటన్ల సంస్కృతి అంత అద్భుతంగా ఉంటే, మీ పరిపాలన మీద భరోసా ఉంటే అంత మంది రైతులు ఎందుకు ఆత్మహత్యలకు పాల్పడతారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ సీఎం జగన్ ను ప్రశ్నించారు. మీ సొంత నియోజకవర్గం పులివెందులలోనే 44 మంది కౌలు రైతులు ప్రభుత్వం నుంచి ఏ విధమైన భరోసా లభించని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకున్నారని ఆయనకు గుర్తుచేశారు. ఈ ముఖ్యమంత్రి స్పందించే మనస్తత్వం లేని వ్యక్తంటూ ఆరోపించారు. యంత్రాంగం పని చేస్తున్నా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నుంచి స్పందన కరువైనప్పుడే ఇటువంటి పరిస్థితులు తలెత్తుతాయన్నారు.
జగన్ బటన్ పై చెయ్యి తీయడం లేదన్న సోము
జగన్ బటన్ క్లిక్స్ పై బీజేపీ కూడా ఇవాళ ఆరోపణలకు దిగింది. సీఎం జగన్ బటన్ మీద చెయ్యి వేసి తియ్యడం లేదని బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుసెటైర్లు వేశారు. కానుకల రూపంలో ప్రజలను మభ్య పెడుతున్నారన్నారంటూ విమర్శించారు. ప్రజలు కూడా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా బటన్ నొక్కుదామని చూస్తున్నారన్నారన్నారు. తద్వారా సీఎం జగన్ నొక్కుతున్న బటన్స్ కు తగినట్లుగానే ప్రజలు కూడా ఎన్నికల్లో బటన్ నొక్కుతారని సోము వీర్రాజు తెలిపారు. తద్వారా జగన్ బటన్ క్లిక్స్ పై జనంలో వ్యతిరేకత ఉందన్నారు.