పవన్ ను బీజేపీ "కట్టడి" - టీడీపీతో జత కట్టాలంటే, ఇదీ లెక్క..!!
తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో ఏపీ సమీకరణాలను పరిగణలోకి తీసుకుంటోంది. తెలంగాణలో జనసేనతో కలిసి వెళ్తున్న బీజేపీ తాజాగా సామాజిక సమీకరణాల పైన కీలక నిర్ణయాలు తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే బీసీ సీఎం చేస్తామని ప్రకటించిన బీజేపీ...ఎస్సీ వర్గీకరణ అంశంలో ప్రధాని సానుకూల ప్రకటన చేసారు. అయితే, ఏపీలో బీజేపీ వ్యూహం ఆసక్తి కరంగా మారుతోంది.
బీజేపీ వ్యూహాత్మక అడుగులు: తెలంగాణలో ప్రధానంగా పోటీ కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ గా కనిపిస్తోంది. అనూహ్యంగా బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి. తెలంగాణలో బీసీ సీఎం నినాదం, ఎస్సీ వర్గీకరణ అంశం తమకు అనుకూలంగా మారుతుందని బీజేపీ భావిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలతో పాటుగా త్వరలో జరిగే లోక్ సభ ఎన్నికలకు మేలు చేసేలా బీజేపీ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు స్పష్టం అవుతోంది.

తెలంగాణలో పోటీ నుంచి టీడీపీ తప్పుకుంది. అయితే, ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేనతో బీజేపీ తెలంగాణ ఎన్నికల్లో పొత్తు ఖరారు చేసుంది. 8 సీట్లు కేటాయించింది. ప్రధానితో పాటుగా హైదరాబాద్ సభలో పాల్గొన్న పవన్ బీసీ సీఎం నినాదానికి మద్దతు ప్రకటించారు. అయితే, ఏపీలో కూడా పవన్ తన మిత్రపక్షాన్ని ఇదే నిర్ణయానికి ఒప్పింగలరా అనే చర్చ మొదలైంది.
వపన్ ను బీజేపీ కట్టడి: తెలంగాణలో బీజేపీ - జనసేన కూటమికి ఎన్ని సీట్లు వస్తాయనేది ఏపీ రాజకీయాల పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది. బీజేపీతో పవన్ కల్యాణ్తో చేతులు కలపడంలో బహుముఖ వ్యూహం దాగి ఉందని చెబుతున్నారు. తెలంగాణలో సెటిలర్లు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ దశలో పవన్ కల్యాణ్ వల్ల సెటిలర్లలో ఒక వర్గం తమకు మద్దతు ఇస్తుందని తెలంగాణ బీజేపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు.
దీంతో పాటుగా మరో నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో జరగనున్న ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహానికి తెలంగాణలో పవన్ కల్యాణ్తో పొత్తు తొలి మెట్టు అని చెబుతున్నారు. తెలంగాణ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కల్యాణ్ తమను వదిలిపెట్టి తెలుగుదేశం పార్టీతో మాత్రమే వెళ్లిపోకుండా కట్టడి చేయడమే ఈ వ్యూహంగా స్పష్టం అవుతోంది.

ఏపీలో పొత్తు కుదరాలంటే: బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్లడానికి తెలుగుదేశం పార్టీ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల వేళ జగన్ ను ఎదుర్కోవాలంటే బీజేపీ మద్దతు అవసరమనేది టీడీపీ నేతల వాదన. ఈ కారణంగా నే ఒక దశలో ఎన్డీఏకు దూరం కావాలని నిర్ణయించినా..పవన్ బీజేపీతో కొనసాగుతున్నారు. బీజేపీ సహకారం అవసరం అని పవన్ కల్యాణ్ కూడా తన సన్నిహితుల వద్ద చెబుతున్నారు. ఈ కారణంగానే తెలంగాణలో బీజేపీతో చేతులు కలిపినట్టు ఆయన వివరించారని సమాచారం.
దీన్నిబట్టి తెలంగాణలో కలిసిన చేతులు ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీల మధ్య పొత్తు ప్రయత్నాల్లో భాగమని విశ్లేషిస్తున్నారు. అయితే, బీజేపీ ఇప్పటి వరకు టీడీపీతో కలిసేందుకు సిద్దంగా లేదని తెలుస్తోంది. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే..ఏపీలో పొత్తులపై బీజేపీ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో, ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల ఫలితాలు తరువాత ఏపీలో సమీకరణాలు మారే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications