నిలబెట్టుకున్నాం: పురంధేశ్వరి, వెంకయ్యపై బొత్స
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంతో అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయని, అయినా తమ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటుందని బిజెపి నాయకురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.
విజయవాడలో రాష్ట్ర బీజేపీ నేతల సమావేశంలో ఆమె మాట్లాడారు. టీడీపీ బీజేపీలు పరస్పరం ఇబ్బందులు సృష్టించుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో రాంమాధవ్, కావూరి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో ఆందోళనలు చెలరేగుతున్న విషయం తెలిసిందే.
కాగా, ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తామని మాజీమంత్రి, కాంగ్రెసు నాయకుడు బొత్స సత్యనారాయణ చెప్పారు. ప్రత్యేక హోదాపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సాకులు చెప్పడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి టీడీపీ, బీజేపీ కలిసి రాజకీయ వ్యాపారం చేస్తున్నాయని విమర్శించారు.
పరిపాలనను గాలికొదిలి చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని బొత్స ఆరోపించారు. ఎన్నికల్లో ముడుపులు ఇచ్చిన వారికోసమే చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టారని బొత్స విమర్శించారు.
ఇదిలావుంటే, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, బొత్స సత్యనారాయణ, చిరంజీవి, సి. రామచంద్రయ్య, కేవీపీ, కనుమూరి బాపిరాజు, పనబాక లక్ష్మీ తదితరులు ఆందోళనకు దిగారు.