లోకేష్ అవినీతిపై వెనక్కి తగ్గని పవన్ కల్యాణ్: బిజెపితోనా పొత్తు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, మంత్రి నారా లోకేష్ అవినీతిపై తాను ఇంతకు ముందు చేసిన ఆరోపణల నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెనక్కి తగ్గలేదు. జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్లే మాట్లాడారు.
విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారంటూ ఆయన చంద్రబాబుపై, లోకేష్పై విరుచుకుపడ్డారు. ఆయన ఎన్టీటీవితో ప్రత్యేక మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపికి తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఆయన ఎన్డీటీవికి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు..
రాష్ట్రంలో బిజెపికి తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడరని పవన్ కల్యాణ్ అన్నారు. 2014లో ఓట్లు చీలికపోకూడదనే ఉద్దేశంతో తన పార్టీని పోటీకి దించలేదని చెప్పారు. అలా అనుకోకపోతే తాను అప్పట్లో 60-70 అసెంబ్లీ స్థానాలకు, 10-12 లోకసభ స్థానాలకు పోటీ చేసి ఉండేవాడినని అన్నారు.
2014 ఎన్నికల్లో తాను ఏమీ ఆశించకుండా బిజెపి, టిడిపిలకు మద్దతు ఇచ్చానని, అయితే ఆ పార్టీలు ప్రజలు ఆశించినమేరకు పనిచేయలేకపోయాయని పవన్ కల్యాణ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తాను బిజెపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని అన్నారు.