వైసీపీలోకి గోకరాజు..ఫ్యామిలీతో సహా: రఘురామరాజుకు చెక్: బీజేపీతో జగన్ మొదలెట్టేసారు..!
Recommended Video
ఏపీలో టీడీపీనే కాదు..బీజేపీతోనే రాజకీయంగా తేల్చుకొనేందుకు వైసీపీ సిద్దమైంది. బీజేపీకి చెందిన నేతలను తమ పార్టీలో చేర్చుకోవటం ద్వారా ముఖ్యమంత్రి జగన్ తన ఉద్దేశం ఏంటో కమల నాధులకు స్పష్టం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నుండి బీజేపీ ఎంపీగా గెలిచి..పార్టీ అధినేత అమిత్ షా కు అత్యంత సన్నిహితుడు అయిన గోకరాజు గంగరాజుతో సహా ఆయన కుటుంబ సభ్యులు వైసీపీలో చేరుతున్నారు. ఇందుకు ఈ రోజు మధ్నాహ్నం ముహూర్తం ఖరారైంది.
ఆయనతో పాటుగా కుటుంబ సభ్యులు సైతం ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. బీజేపీ కంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, వీహెచ్పీతోనూ సన్నిహితంగా గోకరాజును చేర్చుకోవటం వెనుక రెండు ప్రధాన లక్ష్యాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో..తమ కంటే ఢిల్లీలో బీజేపీ నేతలతో ఎక్కువ సన్నిహితంగా ఉంటున్న సొంత పార్టీ ఎంపీ రఘురామరాజుకు సైతం ఈ నిర్ణయం ద్వారా పరోక్షంగా చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
వైసీపీలోకి బీజేపీ కీలక నేత
2014 ఎన్నికల్లో బీజేపీ నుండి నర్సాపురం ఎంపీగా గెలిచిన గోకరాజు గంగరాజు వైసీపీలో చేరుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అత్యంత సాన్నిహిత్యం ఉన్న గోకరాజు తన కుటుంబ సభ్యులతో సహా వైపీపీలో చేరాలని నిర్ణయించటం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గోకరాజు గంగరాజు మొదట్నుంచి బీజేపీకి సన్నిహితంగా ఉంటూ కీలకనేతగా ఉన్నారు. బీజేపీ కంటే ముఖ్యంగా ఆర్ఎస్ఎస్, వీహెచ్పీతోనూ సన్నిహితంగా ఉండేవారు. ప్రస్తుత కేంద్ర మంత్రి అమిత్ షా ఎప్పుడు ఏపీకి వచ్చినా గోకరాజు అతిథి గృహంలోనే బస చేసేవారు. అమిత్ షాకు గోకరాజు అత్యంత సన్నిహితుడు. గంగరాజుతో పాటుగా ఆయన తనయుడు రంగరాజు, గోకరాజు సోదరులు నరసింహరాజు, రామరాజు ఈ మధ్నాహ్నం వైసీపీలో చేరనున్నారు.
రఘురామ రాజుకు చెక్..!
వైసీపీ ఎంపీ రఘురామరాజు బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటూ..గెలిచిన పార్టీ నేతలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని వైసీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. దీంతో..ఆయన కు చెక్ పెట్టేందుకు గోకరాజు కుటుంబాన్ని వైసీపీలోకి అదే నర్సాపురం నియోజకవర్గం నుండి పార్టీలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో బీజేపీ నుండి రఘురామ రాజు బీజేపీ టిక్కెట్ ఆశించారు. తనకు టిక్కెట్ ఖాయమని భావించారు. చివరి నిమిషంలో ఆరెస్సెస్ పెద్దల జోక్యంతో సీటు గోకరాజుకు దక్కింది. వ్యాపార పరంగానే కాకుండా.. భారత క్రికెట్ బోర్డులో..అదే విధంగా హిందూ సంస్థలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ చేరిక పైన రఘురామరాజుకు అభ్యంతరం లేదని..ఆయనతో కలిసి గోకరాజు కుటుంబం పని చేస్తుందని వైసీపీ నేతలు చెబుతున్నా..రఘురామ రాజు మాత్రం కినుక వహించటం ఖాయమనే ప్రచారం సాగుతోంది.
హిందుత్వ సంస్థలతో మైత్రి కోసమేనా..
రాజధాని ప్రాంతంలోని క్రిష్టా కరకట్ట వద్ద ఉన్న నిర్మాణాలను కూల్చివేయాల్సిందేనని ముఖ్యమంత్రి జగన్ తొలి నుండి భావిస్తున్నారు. ఈ భవనాల్లో గోకరాజు కు సైతం భారీ నిర్మాణం ఉంది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. అయితే, గోకరాజు కుటుంబాన్ని పార్టీలో చేర్చుకోవటం ద్వారా ఆయనకు ఆర్ఎస్ఎస్.. వీహెచ్పీతో ఉన్న సత్సంబంధాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయంగా మేలు చేస్తాయని వైసీపీ భావిస్తోంది. ముఖ్యమంత్రి లక్ష్యంగా హిందూ వ్యతిరేకి ముద్ర వేసే ప్రయత్నం జరుగుతున్న సమయంలో ఈ చేరికల ద్వారా వారితోనే ఈ విమర్శలకు సమాధానం చెప్పించాలనేది వైసీపీ నేతల వ్యూహంగా కనిపిస్తోంది.
బీజేపీతో మొదలెట్టేసినట్లేనా..
ఇప్పటి వరకు టీడీపీ ఎమ్మెల్యేలు..నేతల మీదనే వైసీపీ ఫోకస్ చేసింది. అయితే, ఇక బీజేపీ నేతలు సైతం తమ పార్టీలో చేరేందుకు ముందుకు వస్తే వేచి చూడాల్సిన అవసరం లేదని వైసీపీ నిర్ణయానికి వచ్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో కొంత మంది నేతలు బీజేపీ కాదని వైసీపీలో చేరే సమయంలో ఆ పార్టీ ముఖ్య నేతల సూచన మేరకు వైసీపీ వెనుకడుగు వేసింది. కన్నా లక్ష్మీనారాయణ తొలుత వైసీపీలో చేరాలని భావించిన సమయంలో ఇదే రకంగా బీజేపి ముఖ్యనేత మాటకు విలువ ఇచ్చి పార్టీలో చేర్చుకోలేదు. ఇక..ఇప్పుడు అటు ఢిల్లీలో..ఏపీలో మారుతున్న రాజకీయాలు..తెర వెనుక వ్యూహాలతో బీజేపీతో సైతం రాజకీయం మొదలు పెట్టాల్సిందేనని వైసీపీ భావిస్తోంది. అందులో తొలి అడుగు..ఈ మధ్నాహ్నం గోకరాజు కుటుంబం వైసీపీలో చేరిక.