కేసీఆర్, జగన్ లపై విరుచుకుపడిన బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి; డ్రామాలంటూ ఆగ్రహం
ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై, అలాగే తెలంగాణ సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి డ్రామాలకు తెరలేపారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విరుచుకుపడ్డారు. కేసీఆర్ బీజేపీపై, ప్రధాని మోడీపై చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. స్వార్ధ రాజకీయ ఆలోచనతోనే జగన్, కేసీఆర్ లు మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ పట్ల కేసీఆర్ ది కపట ప్రేమ
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో ఆయన బిజెపి సర్కార్ పై విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేసిన విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ సీఎం కెసిఆర్ పై నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు నిత్యం భంగం కలిగించే కేసీఆర్, ఇప్పుడు కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కేసీఆర్ నటనలను ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు.
రాయలసీమ ప్రాజెక్ట్ లను ఎందుకు అడ్డుకున్నారు
కెసిఆర్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల అంత ప్రేమ ఉంటే రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో నిర్దాక్షిణ్యంగా ఎందుకు వ్యవహరించారో చెప్పాలని విష్ణువర్ధన్ రెడ్డి కేసిఆర్ కు సూటి ప్రశ్నలు సంధించారు. కెసిఆర్ పదేపదే బీజేపీ అవినీతి చిట్టా బయటపెడతామని విమర్శలు చేస్తున్నారని, కెసిఆర్ కు దమ్ముంటే ఆ పని చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. కెసిఆర్ బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడేవారు లేరని విష్ణువర్ధన్ రెడ్డి తేల్చి చెప్పారు.
ప్రత్యేక హోదాతో ప్రజలను వంచించే కుట్ర చేస్తున్న జగన్
ఇక ఇదే సమయంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేసిన విష్ణువర్ధన్ రెడ్డి లేని ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదకు తీసుకువచ్చిన ప్రజలను వంచించేందుకు మరో ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014 తర్వాత ప్రత్యేక హోదా ఏ రాష్ట్రానికి లేదన్న విషయం మీకు తెలియదా అంటూ వైసిపి పెద్దలను విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానిని సార్లు కలిసినా, ఏ రోజు అయినా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. అసలు ప్రత్యేక హోదా కావాలని కోరినప్పుడు ప్రత్యేక ప్యాకేజీ నిధులు ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలని జగన్మోహన్ రెడ్డిని సూటిగా ప్రశ్నించారు విష్ణువర్ధన్ రెడ్డి.