రామతీర్ధం ఘటన: వైసీపీ, టీడీపీలదే బాధ్యత; ఆలయాల దర్శనం టికెట్ల ధరలపై బీజేపీనేత విష్ణువర్ధన్ రెడ్డి
విజయనగరంలోని రామతీర్థం బోడికొండపై కోదండ రామాలయం శంకుస్థాపన కార్యక్రమంలో జరిగిన ఘటనపై బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. రామతీర్థం లో చోటుచేసుకున్న ఘటన హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీలు బాధ్యత వహించాలని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆలయ శంకుస్థాపనలో జరిగిన గొడవపై చర్యలు తీసుకోలేదు
ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం రామతీర్థం కోదండ రామాలయం శంకుస్థాపన కార్యక్రమంలో జరిగిన గొడవపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఇక హిందూ ధార్మిక ఆలయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ నుండి నిధులను కేటాయించాలని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

సినిమా టికెట్లు సరే .. ఆలయాల దర్శనం టికెట్లు, సంక్రాంతి బస్సు టికెట్ల ధరలు తగ్గించరా?
ఇదే సమయంలో తాజాగా నెలకొన్న సినిమా టికెట్ల ధరల అంశంపై విష్ణువర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కావాలని వైసీపీ ప్రభుత్వం సినిమా టికెట్ల అంశాన్ని అనవసరపు రాద్ధాంతం చేస్తోందని, వివాదంగా మార్చిందని ఆయన పేర్కొన్నారు. సినిమా టికెట్ల ధరల పై పెట్టిన శ్రద్ధ రానున్న సంక్రాంతి నేపథ్యంలో బస్సు టికెట్ల ధరలు, ఆలయాల్లో దర్శన టికెట్ల ధరలను తగ్గించడంపై పెట్టాలని సూచించారు. వైసిపి సర్కారు ఎందుకు ఆలయాల్లో దర్శన టికెట్ల ధరలను బస్సు టికెట్ల ధరలు తగ్గించడం లేదని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.

ప్రభుత్వ వైఫల్యాలు పక్క దారి పట్టించే వైసీపీ ప్లాన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా సినిమా థియేటర్లపై అధికారులు దాడులు చేస్తున్నారని, ఇప్పుడు ఇంతగా దాడులు చేస్తున్న ప్రభుత్వం, అంతకు ముందంతా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు గుర్తిస్తారని వాటిని పక్కదారి పట్టించడం కోసం లేని సమస్యలను వైసిపి సృష్టిస్తోందని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే రామతీర్థం ఆలయం వద్ద శంకుస్థాపన సమయంలో చోటుచేసుకున్న ఘటనలో టిడిపి సీనియర్ నాయకుడు మాజీ కేంద్రమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు తనకు అవమానం జరిగిందని అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

రామతీర్ధం ఆలయ శంకుస్థాపన రగడ, టీడీపీ వర్సెస్ వైసీపీ
ఆలయ సంప్రదాయాలను పాటించకుండా మంత్రులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించే వారిని, కనీసం తనను కొబ్బరికాయ కూడా కొట్టకుండా మంత్రి వెల్లంపల్లి అడ్డుకున్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత అక్కడ ఉన్న శిలాఫలకాన్ని తీసివేసే ప్రయత్నం చేశారు అశోక్ గజపతిరాజు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇక దీనిపై వైసిపి నాయకులు టిడిపి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది.

రామతీర్ధం ఆలయంపై పొలిటికల్ ఫైట్ .. బీజేపీ నేత ఫైర్
వైసీపీ మంత్రులు కావాలని అశోక్ గజపతిరాజు వివాదం చేశారని ఆయన పై మండిపడగా, టిడిపి నేతలు వైసీపీ మంత్రులు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఈవో ఫిర్యాదు మేరకు అశోక్ గజపతిరాజు పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక దీనిపై అశోక్ గజపతిరాజు తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో రద్దు చేయాలంటూ హైకోర్టును ఆశ్రయించారు . మొత్తంగా రామతీర్థం శంకుస్థాపన పై పొలిటికల్ ఫైట్ కొనసాగుతున్న సమయంలో బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ రెండూ బాధ్యత వహించాలని రెండు పార్టీల పై విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications