రంగంలోకి విష్ణుకుమార్ రాజు: జగన్తో బీజేఎల్పీ నేత రాయబారం
హైదరాబాద్: బీజేపీ నేత, ఆంధ్రప్రదేస్ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభా పక్షనేత విష్షుకుమార్ రాజు తనదైన శైలిలో రాయబారాలు నడుపుతున్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో ఆయన అధికార పక్షాన్ని ఒప్పించారు.
తాజాగా ఆదివారం ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా మొదటిరోజే ఏపీకి ప్రత్యేక హోదాపై గందరగోళం చోటుచేసుకుంది. అధికార, విపక్షాలు మాటల యుద్ధానికి దిగాయి. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ రంగంలోకి దిగారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విష్ణుకుమార్ రాజు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అసెంబ్లీలోని జగన్ ఛాంబర్లో జరిగిన ఈ భేటీలో ప్రత్యేక హోదాపై చర్చలో మాట్లాడేందుకు సర్కారు అవకాశమిస్తుందని విపక్ష నేతకు ఆయన సూచించారు.
అయితే ఇప్పటికే ఒంటి గంట దాటిపోయిందని, ఇక తనకెప్పుడు మాట్లాడే అవకాశమిస్తారని జగన్ అనుమానం వ్యక్తం చేశారు. తాను అధికార పక్షంతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చి జగన్ ఛాంబర్ నుంచిబయటకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.
ఈ క్రమంలో అధికార పక్షం వద్దకెళ్లిన విష్ణుకుమార్ రాజు, ప్రతిపక్ష నేత వాదనను తెలుగుదేశం పార్టీ నేతల ముందు పెట్టారు. దీంతో టీడీపీ నేతలు కూడా విష్ణుకుమార్ రాజు ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు.
ఈ విషయాన్ని ప్రతిపక్ష జగన్కు తెలియజేసి విష్ణకుమార్ రాజు పరిస్థితిని దారిలోకి తెచ్చి, ఆ తర్వాతే సభలో సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదాపై చర్చను ప్రారంభించారు.