చేతకాని ప్రభుత్వం ఇంకా ఎందుకు?, అఖిలపక్షానికి రావట్లేదు: బాబుకు విష్ణుకుమార్ రాజు లేఖ..
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన శనివారం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆయనకు లేఖ రాశారు. అఖిలపక్షానికి తాము హాజరుకావడం లేదని లేఖలో పేర్కొన్నారు.
సొంత ప్రయోజనాల కోసమే చంద్రబాబు అఖిలపక్ష భేటీ పెట్టారని, టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. మొదట ప్యాకేజీకి మొగ్గుచూపి, ఇప్పుడేమో కేంద్రం రాష్ట్రానికేదో అన్యాయం చేసిందని గగ్గోలు పెట్టడం సరికాదన్నారు.
టీడీపీ ఎంపీల ధర్నాలు, సైకిల్ ర్యాలీలు అంతా చవకబారు ప్రచారమని విమర్శించారు. ఏపీ ప్రభుత్వాన్ని కాగ్ కడిగేసిందని, చేతకాని ప్రభుత్వం ఇంకా ఎందుకు పాలన సాగిస్తోందని ప్రశ్నించారు. కేంద్ర నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు.
సీఎం రమేశ్ నివాసంలో టీడీపీ ఎంపీల సమావేశం:
ఢిల్లీలో హోదా పోరును ఉధృతం చేసే యోచనలో భాగంగా.. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ నివాసంలో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. సమావేశంలో రాబోయే రెండు మూడు రోజుల్లో ఢిల్లీలో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు.
కాగా, ఈరోజు ఉదయం ఎంపీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మరో రెండు, మూడు రోజుల్లో డిల్లీలోనే ఉండాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆందోళన కార్యక్రమాలపై చర్చించేందుకు ఎంపీలంతా సీఎం రమేష్ ఇంట్లో భేటీ అయ్యారు.