జగన్ కు టీజీ వెంకటేష్ సలహా- మూడు రాజధానుల నుంచి బయటపడాలంటే-బీజేపీని ఒప్పిస్తా
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం కాకరేపుతోంది. వైసీపీ ప్రభుత్వం తాము తీసుకొచ్చిన ముూడు రాజధానుల బిల్లుల్ని తాజాగా ఉపసంహరించుకుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోందనే చర్చ సర్వత్రా సాగుతోంది. దీంతో ఈ విషయంపై ఎవరికి నచ్చిన విశ్లేషణలు వారు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ సీఎం జగన్ కు కొన్ని కీలక సూచనలు చేశారు.
రాజధాని రైతులకు ముఖ్యమంత్రి ఎలాంటి భరోసా ఇవ్వకుండా వికేంద్రీకరణతో ముందుకు వెళ్లడం వల్లే సమస్య మొదలైందని టీజీ వెంకటేష్ అన్నారు. మూడు రాజధానులపై మళ్లీ చట్టం చేసి కోర్టుల్లో పిటిషన్లు దాఖలైతే దీనిపై ఎలాంటి ప్రయోజనం ఉండబోదని జగన్ సర్కార్ కు తెలిపారు. కాబట్టి అమరావతినే రాజధానిగా ఉంచి పేరేదైనా పెట్టుకోవాలని జగన్ సర్కార్ కు సూచించారు. సీఎం జగన్ అభివృద్ధి మాత్రం చేయాలని, ఆయన గందరగోళంలో పరిపాలన చేస్తే రాష్ట్రం సవ్యంగా ఉండదని టీజీ వివరంచారు. రాజధానిని ముక్కలు చేయకుండా ఒక చోట సచివాలయం, మరోచోట శీతాకాల సమావేశాలు, ఇంకోచోట వేసవికాల సమావేశాలు నిర్వహిస్తే సమస్య పరిష్కారం అవుతుందని టీజీ సూచించారు. సీఎం జగన్ తన సలహా వింటే ఆ మేరకు బీజేపీని ఒప్పించే బాధ్యత తనదేనని టీజీ వెంకటేష్ తెలిపారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు.
గతంలో అశోకుడి పాలనలో కర్నూలు జిల్లాలోని జొన్నగిరి రాజధానిగా ఉండేదని, కాబట్టి ఇక్కడ మరోసారి రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీకి చెప్పినట్లు టీజీ వెంకటేష్ తెలిపారు. ప్రస్తుతానికి కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసి, తర్వాత హైకోర్టు కోసం ప్రయత్నం చేయాలని, లేకపోతే రెండూ పోతాయని టీజీ హెచ్చరించారు. విశాఖలో సచివాలయం పెడితే రాయలసీకు దూరం అవుతుందని, కాబట్టి కర్నూలులో మినీ సచివాలయం ఏర్పాటు చేయాలని టీజీ కోరారు. అలాగే అమరావతిలో రైతులు, భూములు పోగొట్టుకున్న వారికి న్యాయం చేయాలని టీజీ జగన్ సర్కార్ ను కోరారు.