ప్రధాని, షా కొత్త లెక్కల వెనుక - టీడీపీకి కలిసొచ్చేనా, ఏం జరుగుతోంది..!!
ప్రధాని మోదీ..కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొత్త రాజకీయం మొదలు పెట్టారు. కేంద్రంలో మూడో సారి అధికారం దక్కించుకోవటం అసలు లక్ష్యం. ఇందు కోసం లేటుగా అయినా లేటెస్ట్ గా పాత మిత్రులను కలుపుకొనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఎన్టీఏ విస్తరణ ఆలోచనలు అమలు చేస్తున్నారు. పాత మిత్రులకు ఆహ్వానాలు పంపుతున్నారు. అందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, జనసేనతో మైత్రి దిశగా అడుగులు పడుతున్నాయి. బీజేపీ లాభం జరిగేలా ప్రారంభమైన ఈ కసరత్తు..టీడీపీ, జనసేనకు మేలు చేస్తాయా అనేదే చర్చ.
మోదీ - షా బిగ్ స్కెచ్ : కేంద్రంలో ప్రధాని మోదీ తొమ్మదేళ్ల పాలన పూర్తి చేసారు. మరో తొమ్మిది నెలల కాలంలో పార్లమెంట్ ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు. మచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలనేది ప్రధాని మోదీ, అమిత్ షా ద్వయం అసలు లక్ష్యం. కర్ణాటక ఎన్నికల ఫలితాల తరువాత జాతీయ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీ వ్యతిరేక పార్టీలు కాంగ్రెస్ నాయకత్వంలో కలిసి పని చేసేందుకు ఒక్కటి అవుతున్నాయి.

పదేళ్ల పాలన తరువాత యాంటీ ఇంకంబన్సీ సహజంగానే పెరుగుతుంది. దక్షిణాదిన బీజేపీకి అధికారం ఉన్న ఏకైక రాష్ట్రం చేజార్చుకుంది. దక్షిణాదిలో తిరిగి ఏ రాష్ట్రంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం దరి దాపుల్లో లేదు. తెలంగాణలో ఆశలు పెట్టుకున్నా సాధ్యపడే పరిస్థితులు కనిపించటం లేదు.
ఎన్డీఏ విస్తరణ దిశగా : దక్షిణాది రాష్ట్రాల్లో అన్నా డీఎంకే మాత్రమే ప్రస్తుతం బీజేపీకి మద్దతుగా ఉంది. ఆ పార్టీ తమిళనాడులో నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. త్వరలో అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ముందు జరిగే ఈ అయిదు రాష్ట్రాల ఎలక్షన్స్ కీలకంగా మారనున్నాయి. ఇదే సమయంలో ముందస్తుగానే మద్దతు దారులను కూడగట్టాలని బీజేపీ నాయకత్వం నిర్ణయించింది. మాజీ మిత్రులను కలుపుకొనేందుకు పావులు కదిపింది.
జేడీఎస్ ముందుకు వచ్చింది. శివసేన చీలిక వర్గం బీజేపీతోనే ఉంది. శిరోమణి అకాలీ దళ్ తోనూ చర్చలు జరిగే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది. అక్కడ పొత్తులు అవసరమని గుర్తించింది. ఇందుకు టీడీపీ అధినేతతో చర్చలు చేసింది. తెలంగాణ వరకు తొలుత టీడీపీతో పొత్తుకు ప్రతిపాదించింది. పొత్తు అనేది ఉంటే రెండు రాష్ట్రాల్లోనూ ఉండాలని చంద్రబాబు తేల్చి చెప్పారు.

టీడీపీకి మేలు జరిగేనా : ఏపీలో వైసీపీ పలు సందర్భాల్లో కేంద్రానికి మద్దతుగా నిలిచింది. వైసీపీని ఎన్డీఏలోకి రావాలని బీజేపీ నాయకత్వం ఆహ్వానించింది. అందుకు సీఎం జగన్ ససేమిరా అన్నారు. అవసరమైన సమయంలో మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణకే టీడీపీతో పొత్తుకు పరిమితం కావాలని భావించిన బీజేపీ, ఇప్పుడు ఏపీకి పొత్తు విస్తరించక తప్పని పరిస్థితి. కానీ, ఈ పొత్తు టీడీపీ ద్వారా బీజేపీకి ప్రయోజనం కలిగిస్తుంది కానీ, టీడీపీకి మాత్రం కాదనే అభిప్రాయం ఉంది.
బీజేపీ నెరవేర్చని హామీల సమయంలో ఇప్పుడు టీడీపీ పొత్తు పెట్టుకుంటే లాభమా..నష్టమా అనే చర్చ మొదలైంది. బీజేపీ అవసరానికి అనుగుణంగా రాజకీయాలు చేస్తుందంటూ ప్రజల్లో జరుగుతున్న వ్యతిరేక చర్చ టీడీపీ పైన ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో, ఎన్డీఏ విస్తరణ చర్యల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ వేస్తున్న ఈ అడుగులు ఎవరికి మేలు చేస్తాయనేది రానున్న రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications