జగన్ సర్కార్ పై మరో 'సీబీఐ'-ఈసారి విశాఖ భూములపై! సీఎంకు సోము లేఖ వెనుక ?
ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాల రాజకీయంలో బీజేపీ రూటే వేరు. రాష్ట్రంలో వైసీపీని అధికారంలోకి రాగానే కేంద్రంలో తమ రాజకీయ అవసరాల కోసం ఆ పార్టీని వాడుకోవడం మొదలుపెట్టిన బీజేపీ ఇప్పుడు వచ్చే ఎన్నికల దృష్టితో కొత్త రాజకీయాలకు తెరదీస్తోంది. ఓవైపు వైసీపీతో స్నేహం నటిస్తూనే మరోవైపు ఆ పార్టీని ఇరుకునపెట్టే వ్యూహాలు రచిస్తోంది. ఇంకా చెప్పాలంటే భవిష్యత్తులో ఆ పార్టీని ఇరుకునపెట్టేందుకు ఇప్పటినుంచే వ్యూహాలకు పదునుపెడుతోంది. ఇదంతా చూస్తున్న వైసీపీ అధినేత మాత్రం మౌనంగా ఉంటున్నారు.
వైసీపీతో బీజేపీ స్నేహం
ఏపీలో వైసీపీ-బీజేపీ మధ్య స్నేహం ఉందా అంటే లేదంటారు, కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన సన్నిహిత సంబంధాలు మాత్రం ఉన్నాయంటారు. అలాగని ఏపీ కోసం వైసీపీ చేస్తున్న డిమాండ్లలో ఒక్కటైనా నెరవేరుస్తున్నారా అంటే అదీ లేదు. తాజాగా ప్రధాని మోడీ విశాఖ టూర్ లో సైతం వైసీపీ కోరిన విధంగా, ఇంకా చెప్పాలంటే గతంలో కేంద్రం ఇచ్చిన విభజన హామీల ప్రకారం చేయాల్సిన పనుల్లో ఒక్కదాన్నైనా చేయడం పక్కనబెడితే కనీసం ప్రస్తావించకుండానే ప్రధాని తిరిగి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో వైసీపీ విషయంలో ఎలా ఉండాలనే దానిపై మిత్రపక్ష నేత పవన్ కళ్యాణ్ కు మాత్రం బీజేపీ దిశానిర్దేశం చేస్తూనే ఉంది. అంతటితో ఆగకుండా వైసీపీని భవిష్యత్తులో చికాకుపెట్టే పనుల్ని ఇప్పటి నుంచే రెడీ చేస్తోంది.
విశాఖ భూ కుంభకోణంపై బీజేపీ
గతంలో ఎప్పుడో జగన్ తండ్రి వైఎస్ హయాంలో విశాఖలో జరిగిన భూముల స్కాంకు సంబంధించి తాజాగా వార్తాపత్రికల్లో వచ్చిన వివరాల్ని పట్టుకుని ఇప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు బీజేపీ సిద్ధమైంది. ఇప్పటికే విశాఖలో భూముల స్కాంపై అధికార, విపక్షాల మధ్య మాటలయుద్ధం సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్కాంపై నిజానిజాలు తేల్చేందుకు వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అసలే కొత్త రాజధానిగా ప్రతిపాదిస్తున్న ప్రాంతం కావడం, ఇక్కడ భూముల విషయంలో చోటు చేసుకునే చిన్న పరిణామమైనా రాష్ట్రంలో రాజకీయంగా ప్రాధాన్యమయ్యే అవకాశాలు ఉండటంతో బీజేపీ ఈ స్కాంపై విచారణకు ఒత్తిడి పెంచుతోంది.
జగన్ కు సోమువీర్రాజు లేఖ
విశాఖలో గతంలో చోటు చేసుకున్న భూముల స్కాంపై ఇవాళ సీఎం జగన్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు లేఖ రాశారు. ఇందులో పలు విషయాల్ని ఆయన ప్రస్తావించారు. విశాఖపట్నం నగరం, పరిసర ప్రాంతాల్లో, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ,ప్రైవేటు,దేవాదాయ శాఖకు చెందిన భూములతో పాటు స్వాతంత్ర్య సమరయోధులు, వారి కుటుంబాలకు, మాజీ సైనిక ఉద్యోగులకు కేటాయించిన భూములు, సామాన్య మధ్యతరగతికి చెందిన వారి భూములే కాదు, ఎక్కడ ఖాళీగా కనబడితే అక్కడ గత రెండు దశాబ్దలుగా అక్రమార్కులు గద్దల్లా వాలి,వారి కబంధ హస్తాల్లో భూములు కబ్జాలకు గురైన విషయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా మీ దృష్టికి మరోసారి తెస్తున్నానంటూ జగన్ కు రాసిన లేఖలో సోము పేర్కొన్నారు. విశాఖపట్నం & ఉత్తరాంధ్ర జిల్లాల్లో దురాక్రమణకు గురైన భూములను కబ్జా రాయుళ్లు నుండి తిరిగి స్వాధీనం చేసుకుని వాటి నిజమైన యాజమాన్యాలకు అప్పగించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగిందని గుర్తుచేశారు. దర్యాప్తు చేయాల్సిన అంశాలపై ప్రభుత్వం దోబూచలాడుతూ ద్వంద్వ వైఖరి అవలంభించడాన్ని బహిరంగ లేఖ ద్వారా ఈ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వస్తున్నట్లు సోము తెలిపారు.
సీబీఐ లేదా సిట్టింగ్ జడ్డితో విచారణకు డిమాండ్
రెండు దశాబ్దాలుగా విశాఖపట్నం పరిధిలో, వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రభుత్వ భూముల కబ్జాలు, ప్రైవేటు, వివాదాస్పద భూముల దురాక్రమణలు జరిగాయని మీకూ తెలుసంటూ జగన్ కు రాసిన లేఖలో సోము తెలిపారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి, వాటిని తెగనమ్ముకోవటానికి ఎన్ఓసీలు పొందటం, మాజీ సైనికులకు, స్వాతంత్ర్య సమరయోధులకు కేటాయించిన ప్రభుత్వ భూములను నయానో భయానో బెదిరించి స్వాధీనం చేసుకుని వాటికి అనేక వక్ర మార్గాల్లో ఎన్వోసీలు పొందడం జగద్విదితమన్నారు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వేల కోట్ల విలువైన అక్రమలావాదేవీల మీద, భూములు అన్యాక్రాంతం కావటం మీదా సిబిఐ విచారణ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సోము డిమాండ్ చేశారు.
సోము లేఖ వెనుక ?
కొత్త రాజధానిగా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న విశాఖలో భూముల స్కాంపై నిజానిజాలు వెలికితీసేందుకు గతంలో నియమించిన సిట్ దర్యాప్తు వివరాలు బయటికొచ్చిన నేపథ్యంలో సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్ చేస్తోంది. తద్వారా విశాఖలో ఆ తర్వాత జరిగిన పలు అక్రమాలు కూడా బయటికి వస్తాయనేది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. అంతే కాదు భవిష్యత్తు రాజకీయాలకు కీలకంగా మారే విశాఖలో భూముల స్కాం బయటికి వస్తే వైసీపీ నేతలతో పాటు పలువురు మాజీ కాంగ్రెస్ నేతలు కూడా ఇరుకునపడటం ఖాయం. అలాగే ఇప్పటికే అక్రమాస్తుల కేసుతో పాటు బాబాయ్ వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తులతో ఇరుకునపడుతున్న జగన్ ను మరింత టార్గెట్ చేసేందుకు, ఇప్పుడు కుదరకపోయనా భవిష్యత్తులో దీన్నో ఆయుధంగా మార్చుకునేందుకు బీజేపీ ఈ మేరకు ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. అందుకే సోము ఈ కొత్త డిమాండ్ తెరపైకి తెచ్చినట్లు అర్ధమవుతోంది.