చిరంజీవి - పవన్ మధ్య చిచ్చు : విడదీయడానికి ఉన్నారా - బీజేపీపై చలసాని సంచలనం..!!
ప్రధాని మోదీ భీమవరం పర్యటకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రధాని తన పర్యటనలో భాగంగా అల్లూరి సీతారామ రాజు విగ్రహావిష్కరణ - సభలో పాల్గొంటారు. దాదాపు లక్ష మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ కేంద్ర పర్యాటక శాఖ నుంచి పలువురికి ఆహ్వానాలు పంపారు. అందులో కేంద్ర మాజీ మంత్రి...ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కూడా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనను కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. చిరంజీవి సైతం రేపు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు సమాచారం అందుతోంది.
అన్నయ్య కు ఓకే.. తమ్ముడిని ఆహ్వానించరా
అయితే, ఇదే సమయంలో చిరంజీవిని ఆహ్వానించటం ... జనసేన అధినేత పవన్ ను ఆహ్వానించకపోవటం పై ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోడీ ఇక్కడకు రావటం ప్రధానమంత్రి హోదాకే అవమానకరమంటూ వ్యాఖ్యానించారు.
అల్లూరి సీతారామరాజు పేరు మీ గుజరాత్ లో ఎంతమంది పెట్టుకున్నారంటూ ప్రశ్నించారు. అల్లూరి తో రాజకీయాలు చేయడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిరంజీవి, కల్యాణ్ ని విడదీయడానికి వున్నారా అంటూ ప్రశ్నించారు. చిరంజీవికి ఆహ్వానం పంపి.. పవన్ కళ్యాణ్ కు పంపకపోవటం పైన ప్రశ్నించారు.
మెగా ఫ్యామిలీ చిచ్చ పెడుతున్నారంటూ
మెగా కుటుంబంలో చిచ్చ పెడుతున్నారంటూ ఆరోపించారు. అల్లూరి సీతారామ రాజు హక్కులు ఆత్మగౌరవం కోసం పోరాడారని గుర్తు చేసారు. అల్లూరు జయంతోత్సవాలకు వస్తున్న ప్రధాని..ఆంధా ప్రాంతానికి అన్యాయం ఎందుకు చేస్తున్నారని నిలదీసారు. కేంద్రంపై కేసీఆర్ పోరాటం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
దక్షిణాదికి జరుగుతోన్న అన్యాయాన్ని ఎదిరిస్తున్నారని..అందరినీ కలిపి ముందుకు వెళ్లాలని చలసాని తెలంగాణ సీఎం కేసీఆర్ ను కోరారు. అయితే, పవన్ కళ్యాణ్ ను ఆహ్వానించకపోవటం పైన ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు స్పందించారు. పవన్ కళ్యాణ్ తమతో కలిసి ఉన్నారని..ఆయన తమ ఇంట్లో అతిధి అంటూ చెప్పుకొచ్చారు. ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించాల్సిన పని లేదంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
టీడీపీ నుంచి అచ్చెన్నాయుడు హాజరు
ఇక, టీడీపీ అధినేత చంద్రబాబును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. చంద్రబాబు ప్రతినిధిగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరు కానున్నారు. అయితే, పలువురు ప్రవాసాంధ్రులు - అనేక రంగాల ప్రముఖులను సైతం ఆహ్వానించారు. అయితే, ఇప్పుడు బీజేపీ - జనసేన సంబంధాల నడుమ పవన్ కళ్యాణ్ కు ఆహ్వానం పైన వివాదం కొనసాగుతోంది. దీంతో..అసలు పవన్ ఈ కార్యక్రమానికి హాజరు అవుతారా లేదా అనే అంశం పైన ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇక, ఈ కార్యక్రమానికి ఎవరెవరు హాజరు అవుతారనేది వేచి చూడాల్సిందే.