ఎదురు తిరిగిన బిజెపి జ'గన్' వ్యూహం: తిప్పికొట్టిన చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై బిజెపి గందరగోళంలో పడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో తేగే దాకా లాగామా అనే సందేహం బిజెపిని వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
అదే సమయంలో జగన్ తమతో కలిసి వస్తాడా, రాడా అనేది కూడా బిజెపికి అనుమానంగానే ఉంది. మైనారిటీ ఓట్లను ఫణంగా పెట్టి జగన్ బిజెపితో పొత్తు పెట్టుకుంటారా అనే సందేహంతో బిజెపి నేతలు ఉన్నారు.
ఈ స్థితిలో శనివారం విశాఖపట్నంలో బిజెపి ప్రజా ప్రతినిధుల భేటీ జరుగబోతోంది. సాధారణంగా ప్రజా ప్రతినిధుల సమావేశానికి సంఘ్ పరివార్ నేతలు హాజరు కారు. కానీ శనివారం విశాఖలో జరిగే సమావేశానికి వారు హజరవుతున్నారు. దానివల్ల కూడా సమావేశానికి ప్రాధాన్యత చేకూరింది.
9 స్థానాలు బిజెపి లక్ష్యం
వచ్చే ఎన్నికల్లో ఉత్తరాదిన వంద సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని బిజెపి జాతీయ నాయకత్వం అంచనా వేస్తోంది. దాన్ని దక్షిణాది సీట్ల ద్వారా భర్తీ చేసుకోవాలనే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 లోకసభ స్థానాలు గెలుచుకోవాలని అనుకుంటోంది. ఇందుకు అనుగుణంగా బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యూహ రచన చేసినట్లు చెబుతున్నారు.
అయినా కూడా గందరగోళం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 9 లోకసభ స్థానాలను గెలుచుకోవడానికి తెలుగుదేశం పార్టీని వాడుకోవాలా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీని ఉపయోగించుకోవాలా అనే గందరగోళంలో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందా, ఉండదా అనేది సందేహంగానే ఉంది. తెగేదాకా లాగే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకోవాలనే బిజెపి వ్యూహం బెడిసికొడుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
వైఎస్ జగన్ వస్తారా...
బిజెపితో వైఎస్ జగన్కు సాన్నిహిత్యం పెరిగిందని అంటున్నారు. అయితే, మైనారిటీల ఓట్లను వదులుకోవడానికి సిద్ధపడి జగన్ బిజెపితో పొత్తు పెట్టుకుంటారా అనేది చెప్పడం కష్టంగానే ఉంది. ఈ స్థితిలో రాష్ట్రంలో ప్రతిపక్షంగా వ్యవహరించాలా, అధికార పక్షంతో కలిసి పనిచేయాలా అనే విషయాన్ని బిజెపి తేల్చుకోలేకపోతోందని అంటున్నారు.
బాబు కలిసి వస్తారా..
తాజాగా, రాయలసీమ అంశాన్ని బిజెపి నేతలు ముందుకు తెచ్చారు. ఇది చంద్రబాబును చిక్కుల్లో పడేస్తుందని భావిస్తున్నారు. పైగా, బిజెపి, తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విమర్శలు వ్యక్తిగత స్థాయికి కూడా వెళ్తున్నాయి. దీంతో బిజెపి, టిడీపి మధ్య సంబంధాలు చాలా వరకు క్షీణించాయి. ఈ పరిస్థితిలో బిజెపితో చంద్రబాబు కలిసి పనిచేస్తారా అనేది అనుమానంగానే ఉంది. ఒకవేళ కలిసి నడిచినా వచ్చేఎన్నికల్లో తమకు తగినన్ని లోకసభ స్థానాలు కేటాయించబోరని బిజెపి నాయకులు అనుకుంటున్నారు. అందువల్ల తమ లక్ష్యం నెరవేరే అవకాశాలు లేవని అంటన్నారు.
జగన్ తెరచాటు స్నేహమే...
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ బిజెపితో తెరచాటు స్నేహానికి మాత్రమే సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు వైసిపి పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి ఢిల్లీలో బిజెపితో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారు. దీంతో బిజెపిపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు.
ఈ ఫొటోలతో టిడిపి ప్రచారం..
స్వామి స్వరూపానంద వద్ద విజయసాయి రెడ్డి, బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు భేటీ అయిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో వైరల్ అవుతున్నాయి. ఆ భేటీ ఎప్పటిదనేది చెప్పకుండా వాటిని ప్రచారంలోకి తెచ్చారు. టిడిపి నేతలు కూడా దాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దీన్ని బట్టి టిడిపి బిజెపి వ్యూహాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడినట్లు భావించవచ్చునని చెబుతున్నారు.
చంద్రబాబు వ్యూహం ఇదే...
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఆత్మరక్షణ వ్యూహాన్ని అనుసరిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పి దానికి సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని కేంద్రం చెప్పితేనే తాము అంగీకరించామని చంద్రబాబు అంటున్నారు. దీనివల్ల ప్రత్యేక హోదాపై ఉధృతమవుతున్న ఉద్యమం సెగ బిజెపికి తాగే విధంగా చంద్రబాబు వ్యూహాన్ని రచించి అమలు చేస్తున్నారు.