APలో పొత్తులపై రేపు స్పష్టత ఇవ్వనున్న BJP?
భారతీయ జనతాపార్టీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పొత్తుల విషయంలో స్పష్టత ఇవ్వబోతోంది. దాగుడు మూతలు లేకుండా నేరుగా ఏదో ఒక విషయాన్ని ఫైనల్ చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అందుకు వేదికగా 24, 25 తేదీల్లో భీమవరంలో జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు మారనున్నాయి. పార్టీకి సంబంధించిన కీలక విషయాలను ఈ సమావేశాల్లో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకోబోతున్నారు.

జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యక్రమాలే లేవు..
ఏపీలో జనసేనతో పొత్తు కొనసాగుతున్నప్పటికీ ఈ రెండు పార్టీలు కలిసి ఉమ్మడిగా ఒక్క కార్యక్రమం కూడా చేపట్టలేదు. మరోవైపు తెలుగుదేశం పార్టీకి జనసేన దగ్గరవుతుండటం బీజేపీలో కొందరు నేతలకు నచ్చడంలేదు. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు విజయవాడలో పవన్ ను కలిసి విశాఖ పరిణామాలపై సంఘీభావం తెలియజేశారు. అంతకుమించి ఈ రెండు పార్టీల మధ్య ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఎవరికివారు సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు.

పొత్తుండాలని ఒకవర్గం.. వద్దని మరో వర్గం
తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలని ఒక వర్గం, పొత్తు వద్దని మరో వర్గం అధిష్టానానికి చెబుతున్నాయి. కార్యవర్గ సమావేశాలకు ఇద్దరు కేంద్ర మంత్రులు హాజరవుతున్నారు. వీరితో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి, పొత్తుల గురించి చర్చించే అవకాశం ఉంది. అయితే టీడీపీతో కలిసి వెళ్లడానికి బీజేపీ అధిష్టానం సుముఖంగా లేదని రాష్ట్ర నేతలు చెబుతున్నారు. అంతిమంగా పొత్తులు ఫైనల్ చేయాల్సింది అధిష్టానమే. అయితే కొందరు నేతలు టీడీపీతో కలిసి వెళ్దామని, శాసనసభతోపాటు లోక్ సభలో కూడా గౌరవప్రదమైన సంఖ్యలో స్థానాలు సాధిద్దామని చెబుతున్నారు.

అటో? ఇటో? తేల్చేస్తారా?
గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీచేయడంవల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 53 నియోజకవర్గాల్లో లబ్ధి చేకూరింది. ఈసారి అటువంటి పరిస్థితి రాకూడదని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశంతో కలిసి ముందుకు నడవడానికి జనసేన సిద్ధమవుతోంది. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారు కాబోతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిణామాల మధ్య కార్యవర్గ సమావేశాల్లో అటో? ఇటో? తేల్చేయబోతున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications