'బాబూ! వెంకయ్య ఏమన్నాడో తెలుసుగా', 'జగన్ లేఖపై మోడీ నిర్ణయం'
: ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రధానిని నరేంద్ర మోడీని కలవడం సాధారణమేనని, 2019 ఎన్నికల వరకు పొత్తుల గురించి ఆలోచన లేదని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పడు చర్చనీయాంశంగా మారాయి
అమరావతి: ప్రతిపక్ష నేత వైయస్ జగన్ ప్రధానిని నరేంద్ర మోడీని కలవడం సాధారణమేనని, 2019 ఎన్నికల వరకు పొత్తుల గురించి ఆలోచన లేదని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పడు చర్చనీయాంశంగా మారాయి.
మోడీ - జగన్ భేటీల తర్వాత టిడిపి ప్రతిపక్ష నేతను టార్గెట్ చేసింది. దీనిపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ప్రధానితో కలిస్తే తప్పేమిటని నిలదీసింది. తాజాగా, సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా భావించే వెంకయ్య కూడా షాక్ ఇవ్వడం గమనార్హం.

వెంకయ్య ఏమన్నాడో తెలుసుగా
ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ టిడిపికి కౌంటర్ ఇచ్చారు. మోడీని జగన్ కలవడంపై టిడిపి నేతలు విమర్శలు చేయడం విడ్డూరమని బొత్స అన్నారు. ప్రధానితో జగన్ భేటీ అయితే ఇంతమంది ఎందుకు తర్జనభర్జన పడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అన్న మాటలను గుర్తు చేశారు.

హోదాపై మీరేమన్నారు..
ప్రధానితో ఎవరైనా సమావేశం కావచ్చని వెంకయ్య అన్నారని, ఆయన ఈ విధంగా వ్యాఖ్యానించిన విషయం టిడిపి నేతలకు తెలుసు కదా? అని బొత్స అన్నారు. అసలు ప్రత్యేక హోదా ఒక ముగిసిపోయిన అధ్యాయం అని అన్న టిడిపి నేతలకు అసలు ఈ రోజు హోదా అని వ్యాఖ్యానించే అర్హత ఎక్కడిదన్నారు. టీడీపీ నేతలు హోదా వద్దన్నారని, ప్యాకేజ్ చాలన్నారని, అయితే, ఇప్పుడు కేసుల కొట్టివేత కోసం జగన్ ప్రత్యేక హోదాపై పోరాటాన్ని పట్టించుకోకుండా మోడీని కలిశారని ఆరోపణలు చేస్తున్నారని బొత్స మండిపడ్డారు.

జగన్ కలిస్తే మీకేం మంట
హోదా సాధించుకోవడానికి తాము పోరాటం చేస్తూనే ఉంటామని బొత్స చెప్పారు. తెలంగాణ ఎంపీలు కూడా ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపితే, టిడిపి ఎంపీలు మాత్రం ప్రత్యేక హోదాపై రాజ్యసభలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. జగన్.. మోడీని కలిస్తే మీకేంటీ కడుపుమంట, మీకున్న ఇబ్బంది ఏంటీ, కేసుల మాఫీ కోసం అంటారా? అని ప్రశ్నించారు. మళ్లీ ఈ రోజు ప్రత్యేక హోదా అంటూ వ్యాఖ్యలు చేయడానికి సిగ్గనిపించడం లేదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై వైసీపీ రాజీపడబోదన్నారు.

వెంకయ్య ఇలా..
కాగా, శనివారం వెంకయ్య టిడిపికి షాకిచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపితో కలిసి పని చేస్తున్నామని, 2019 వరకు కొనసాగుతుందని, అప్పటి పరిస్థితుల గురించి ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదని వెంకయ్య అన్నారు. బీజేపీ - టీడీపీ ఇప్పుడు కలిసే ఉందని, కలిసే ఉంటామని, వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తామన్నది 2019లో తేల్చుకుంటామన్నారు. అయితే, ఏపీలో బీజేపీ ఎప్పుడు అధికారంలోకి వస్తుందని ఓ విలేకరి ప్రశ్నించగా వెంకయ్య పైవిధంగా స్పందించారు. 2019 గురించి ఇప్పుడు ఆలోచించడం లేదన్నారు. కానీ అందులోని అంతరార్థం విడిపోతామని కాదని కొందరు అంటున్నారు.

జగన్ లేఖపై మోడీ నిర్ణయం తీసుకుంటారు
జగన్ ఇటీవల ప్రధాని మోడీని కలవడంపై ఎందుకు తర్జనభర్జనలు పడుతున్నారో తనకేమి అర్థం కావడం లేదని, ఆయన ఇచ్చిన వినతిపత్రంపై ప్రధాని మోడీ నిర్ణయం తీసుకుంటారని వెంకయ్య చెప్పారు. చంద్రబాబు-ఈడీ అధికారులపై జగన్ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేయడంపై వెంకయ్య పైవిధంగా స్పందించారు.
ఇంకా మాట్లాడుతూ.. ప్రాథమిక రాజకీయ పరిజ్ఞానం, పరిపక్వత ఉన్న వారు అర్థం చేసుకుంటారని, ఇంతకంటే విశేషమేమి లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్న వారిని ప్రతిపక్ష నాయకులు కలవడం సహజమని, ప్రధాని మోడీని రాష్ట్రాలకు చెందిన అయా పార్టీల ప్రతినిధులు, ప్రతిపక్ష నేతలు కలుస్తుంటారన్నారు. ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్ 108 రెండేళ్ల పొడిగింపు పరిపాలనాపరమైనదని, రాజకీయఅంశం కాదని వెంకయ్య అన్నారు. రాష్ట్రం కేంద్రం దృష్టికి తన అభిప్రాయాన్ని తీసుకువెళ్లవచ్చని, కేంద్రం నిర్ణయం నచ్చకపోతే ఆ తర్వాత ఏం చేయాలన్నది రాజ్యాంగం హక్కు కల్పించిందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తద్వారా సుప్రీం కోర్టుకు వెళ్తామన్న టిడిపికి ఇలా కౌంటర్ ఇచ్చారు.

రాష్ట్రపతి ఎన్నికకు సహకారంపై..
రాష్ట్రపతి ఎన్నిక దేశానికి సంబంధించినదని, ఏ పార్టీ సహకరించినా సహకారం తీసుకుంటామని వెంకయ్య స్పష్టం చేశారు. తద్వారా జగన్ సహకరిస్తే ఓకే అన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు అందరూ సహకరించాలన్నది తమ అభిప్రాయమని, ఏకగ్రీవమైతే మంచిదన్నారు. ఒకవేళ కాకపోయినా ఎన్డీయేకు మోజార్టీ ఉన్న విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు.












Click it and Unblock the Notifications