విజయవాడలో బ్లేడ్ బ్యాచ్ రిటర్న్స్! 6 గంటల్లో పట్టుకున్న పోలీసులు
విజయవాడ: బెజవాడ అజిత్సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏలూరు కాల్వ గట్టుపై బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులపై గుర్తు తెలియని వ్యక్తులు దోపిడీకి పాల్పడి దాడి చేశారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన మరొకరిపై దాడి చేశారు. అతను తీవ్రంగా గాయపడ్డారు.
భవిష్యత్తులో అంతా సుఖమే అన్నది: రాజేష్, గౌరవం కోసమూ స్వాతి ప్లాన్, కనిపించని పశ్చాత్తాపం
ఈ సంఘటన ఆదివారం రాత్రి వేర్వేరుగా చోటు చేసుకున్నాయి. ప్రజలను వణికించాయి. కాగా, నిందితులను పోలీసులు ఆరు గంటల్లోనే పట్టుకున్నారు. ఆదివారం రాత్రి హత్య జరగగా, ఈ కేసులో ఇద్దరు యువకులతో పాటు ఒక బాలుడిని అజిత్ సింగ్ నగర్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. గతంలోను బ్లేడ్ బ్యాచ్ కలకలం సృష్టించింది.
ఆరు గంటల్లో పట్టుకున్నారు
బుడమేరు మధ్య కట్ట ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు ఆదివారం రాత్రి చందా వెంకటేశ్వర రాజు (55) అనే వ్యక్తితో ఘర్షణ పడి అతనిని పొడిచి, రాయితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. కేవలం ఆరు గంటల వ్యవధిలోనే నిందితులను అరెస్టు చేశామన్నారు.
నిందితులు వీరే
నిందితులను పట్టుకున్న వైనాన్ని డీసీపీ సోమవారం వివరించారు. బుడమేరు మధ్యకట్ట ప్రాంతానికి చెందిన షేక్ బాజీ, కన్నా శేసికుమార్, మరో జువైనల్ ముగ్గురు స్నేహితులు. వీరిలో షేక్ బాజి బీఏ రెండో సంవత్సరం చదువుతుండగా శేసికుమార్ ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. బాలుడు ఇంటర్మీడియట్ సెకండియర్, సీఈసీ చదువుతున్నాడు. ఈ ముగ్గురు ఆదివారం రాత్రి తొమ్మిది గంటలకు అయోధ్య నగర్ రాఘవేంద్ర థియేటర్ సమీపంలోని కాలువగట్టుకు బహిర్భూమికి వెళ్లారు. అదే సమయంలో అక్కడకు వెంకటేశ్వరరాజు వచ్చారు.
పదునైన వస్తువుతో పొడిచి చంపేశారు
వెంకటేశ్వరరాజుతో వీరు ముగ్గురూ ఘర్షణ పడ్డి పదునైన వస్తువుతో పొడిచి హత్య చేశారని తెలిపారు. అదే సమయంలో అటుగా వస్తున్న ఒక వ్యక్తి ఈ దారుణాన్ని చూసి గట్టిగా కేకలు వేయటంతో అతనిని కొట్టి అక్కడ నుంచి పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ పుటేజీ ద్వారా నిందితులను గుర్తించారు. పైపుల రోడ్డు వైవిరావు ఎస్టేట్ సమీపంలో తిరుగుతున్న షేక్ బాజి, శేసికుమార్తో సహా బాలుడిని అరెస్టు చేశారు. తక్కువ సమయంలో నిందితులను అరెస్టు చేసిన పోలీసులను డీసీపీ అభినందించారు.
డబ్బుల కోసం దాడి
వెంకటేశ్వర రాజు నూడుల్స్ వ్యాపారం చేస్తుంటాడు. రోజు రాత్రి ఎనిమిది గంటలకు అలా బయటకు వెళ్తాడు. ఆదివారం కూడా అలా వచ్చి, బహిర్భూమికి వెళ్లాడు. యువకులు కత్తులు, బ్లేడ్లతో బెదిరించి తొలుత అతడి వద్ద ఉన్న రెండు ఉంగరాలు, నగదు, ఫోన్ లాక్కున్నారు. అనంతరం అతడిపై దాడి చేయడంతో మృతి చెందాడు. అదే సమయంలో ప్రకాశ్ నగర్కు చెందిన దుర్గా సినిమా చూసేందుకు వచ్చి బహిర్భూమికి వచ్చాడు. వారు అతనిని డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. లేవని చెప్పడంతో కత్తితో పొడిచారు. అతనికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు.