బోటు ప్రమాదం.. మృతదేహాలకు పురుగులు .. ఆవేదనతో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం
గోదావరిలో కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదం నింపిన పెను విషాదం నుండి ఇంకా తెలుగు రాష్ట్రాలు బయటపడలేదు. ఇప్పటికి పదమూడు మృతదేహాలు జల సమాధి లోనే ఉన్నాయి. వాటిని వెలికి తీయడానికి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు వెలికితీసిన మృతదేహాల పట్ల అధికారులు ఏమాత్రం పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఫలితంగా మృతదేహాలు పురుగులు పట్టి, దుర్వాసన వెదజల్లుతూ భయంకరంగాగుర్తించలేనట్టుగా కనిపిస్తున్నాయి.
మృతదేహాలు కుళ్ళి పురుగులు పడుతున్నా పట్టింపేది ?
పడవ ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్ళి తమ వారి ఆచూకీ కోసం ఆవేదన నిండిన హృదయంతో వెతుకుతున్నారు. ఇప్పటివరకు బయటకు తీసిన మృతదేహాలను మృతుల కుటుంబాలకు అందించాల్సిన బాధ్యత, మృతదేహాలు పాడైపోకుండా కాపాడాల్సిన బాధ్యత అక్కడి అధికార యంత్రాంగం పై ఉంది. అసలే నీటిలో మునిగి మరణించటం వల్ల విపరీతంగా ఉబ్బిపోయిన మృత దేహాలను గుర్తించటం కష్టం అయితే , ఇక మృత దేహాలు బయటకు తీశాక అయినా వెంటనే మార్చురీకి తరలించి శీతల యంత్రాలతో వాటిని ఇంకా పాడు కాకుండా ఉంచాల్సిన అవసరం వుంది . కానీ మృతదేహాలు కుళ్ళి పురుగులు పడుతున్నా పట్టింపే లేనట్టు ఉంది అక్కడ పరిస్థితి .
అధికారుల తీరుపై మృతుల బంధువుల ఆగ్రహం
అధికారులు నదిలో లభించిన మృతదేహాలను తీసుకు వచ్చి ఒడ్డున పడేస్తున్నారు. ఒడ్డున పడేసిన అవి పాడైపోయి, పురుగులు పట్టి దుర్వాసన వెదజల్లుతున్నా పట్టించుకున్న నాథుడు లేరు. ఇక తర్వాత తమకు వీలైనప్పుడు మార్చురీకి తరలిస్తున్న పరిస్థితి. దీంతో మృతుల బంధువులు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ లోని బోడుప్పల్ నుంచి వెళ్లి పడవ ప్రమాదంలో గల్లంతైన పవన్ కుమార్ మేనమామ అక్కడ ఉన్న ఒక మృతదేహం దుస్థితి చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుర్తించలేని విధంగా పురుగులు పడుతున్న మృత దేహాలు
రామాంతపూర్ కు చెందిన ప్రసాద్ మేనల్లుడు పవన్ కుమార్, ఆయన భార్య వసుంధర భవాని, కుమారుడు సుశీల్ పాపికొండలు విహార యాత్రలో గల్లంతయ్యారు. వారి మృతదేహాల కోసం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎదురుచూస్తున్న వారు అక్కడికి వచ్చిన ఒక మృతదేహాన్ని గుర్తించలేకపోయారు. అది తన మేనల్లుడి కుమారుడైన సుశీల్ దేమో నని డీఎన్ఏ పరీక్ష చేయించాలని కోరారు. మృతదేహాన్ని చూసిన ఆయన మృత దేహం నుండి పురుగులు బయటకు రావడంతో తట్టుకోలేకపోయారు.
ఆత్మహత్యా యత్నం చేసిన మృతుని తరపు బంధువు
దీంతో కూల్ డ్రింక్ బాటిల్ పగలగొట్టి కడుపులో పొడుచుకునే ప్రయత్నం చేశారు . అక్కడ ఉన్నవారంతా అడ్డుకోవడంతో ఆయన ఆత్మహత్యాయత్నం విరమించారు. కనీసం పట్టించుకోవడం లేదని, మృతదేహాలు పురుగులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు మృతదేహాలను అందించే వరకు వాటిని కాస్తైన పాడైపోకుండా భద్ర పరచాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ అధికారుల నిర్లక్ష్యం మృతదేహాలు పురుగులు పడిపోతున్నా పట్టింపులేనట్లుగా తయారైంది అన్న ఆవేదన అక్కడకు వెళ్ళిన మృతుల కుటుంబాల నుండి వ్యక్తం అవుతుంది.