ఎండలకూ, హెరిటేజ్కూ లింకేమిటి: అంబటిపై బోండా పైర్
హైదరాబాద్: హెరిటేజ్ కోసమే ఎండాకాలంలో ప్రజలకు మజ్జిగ సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు అంబటి రాంబాబు చేసిన విమర్శలను తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వర రావు ఖండించారు. హెరిటేజ్కూ ఎండలకూ లింకేమిటని ఆయన అడిగారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎండ తీవ్రతను కూడా రాజకీయం చేస్తోందని ఆయన విమర్సించారు. ప్రభుత్వంపైనా, హెరిటేజ్పై బహిరంగ చర్చకు తాము సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. సామాన్యులకు మజ్జిగ సరఫరా చేస్తామని నిర్ణయం తీసుకుంటే కూడా రాజకీయం చేస్తోందని అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల నోటి వెంట 'సేవ్ డెమోక్రసీ' అని రావడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. ఈ నినాదంలో జగన్ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధానిని కలిసి తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వాన్ని పడగొడతానని రాజ్భవన్ ఎదుట జగన్ వ్యాఖ్యానించిన తర్వాతే తాము వైసిపి ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నామన్నారు. జల యజ్ఞాన్ని ధన యజ్ఞంగా మార్చిన నేతలకు ఇప్పుడు కరవు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తాగునీటి సమస్యలపై ఖాళీ బిందెలతో ధర్నాలు చేస్తాననడం కేవలం తమ పార్టీ ఉనికిని చాటుకునేందుకు మాత్రమేనని గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆన్నారు.
రాష్ట్ర అభివృద్ధికి వైసిపి అధినేత జగన్ అడుగడుగునా అడ్డుపడుతున్నారని టిడిపి నేత ఆనం వివేకానందరెడ్డి నెల్లూరులో ఆరోపించారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడమే జగన్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు జగన్కు లేదన్నారు. జగన్కు ప్రత్యేక ప్యాకేజీపై గానీ ప్రత్యేక హోదాపై గానీ అవగాహన లేదన్నారు.












Click it and Unblock the Notifications